రాధేశ్యాముడి కల నెరవేరేనా?

ABN , First Publish Date - 2022-03-09T00:23:54+05:30 IST

భారీ బడ్జెట్‌తో నిర్మించిన రాధేశ్యామ్‌ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ముందు కోవిడ్‌.. ఆ తర్వాత ఆంధ్రలో టిక్కెట్‌ ధరల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ కష్టాలన్నీ తొలగిపోయి సినిమా విడుదలకు

రాధేశ్యాముడి కల నెరవేరేనా?

భారీ బడ్జెట్‌తో నిర్మించిన రాధేశ్యామ్‌ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ముందు కోవిడ్‌.. ఆ తర్వాత ఆంధ్రలో టిక్కెట్‌ ధరల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ కష్టాలన్నీ తొలగిపోయి సినిమా విడుదలకు సిద్ధం అవటంతో అంతా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పరిస్థితులన్నీ అనుకున్నంత అనుకూలంగా లేవని ఫిలిం నగర్‌లో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. రాధేశ్యామ్‌ సినిమాను రాజమౌళి చూసి కొన్ని కట్స్‌ చెప్పి.. నిడివి తగ్గించారనేది ఒక వార్త. సాధారణంగా పెద్ద సినిమాలలో మార్పులు చేర్పులు ముందే జరిగిపోతాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చివరి నిమిషంలో నిడివి ఎందుకు తగ్గించాల్సి వచ్చిందనేది కొందరి ప్రశ్న. 


దీనితో పాటుగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను ముంబాయిలో మొదట ప్రారంభించారు. అయితే ఈ ప్రమోషన్స్‌కు అనుకున్నంత స్పందన కనిపించలేదు. దీనితో పాటుగా హీరోయిన్‌ పూజా హెగ్డే బెంగుళూరు మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోని ఒక భాగం వైరల్‌ అయింది. దీనితో తెలుగులో ప్రమోషన్స్‌ విషయంలో ఆమె ఇబ్బంది పడినట్లు వినికిడి. వీటన్నింటితో పాటుగా ప్రభాస్‌ ‘సాహో’  పరాజయం కూడా నీడలా వెంటాడుతోందని కొందరు విమర్శకులు పేర్కొంటున్నారు. ఈ సినిమా పరాజయం తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాల్సిన కొన్ని బకాయిలు ఇంకా ఇవ్వలేదని.. దీనితో వారు పేచి పెడుతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 


రాధేశ్యామ్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తప్పనిసరిగా విజయం సాధించకపోతే- ఈ సినిమా కోసం పనిచేసిన వారికి.. డిస్ట్రిబ్యూటర్లకు.. థియేటర్‌ యజమానులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక సినిమా విడుదలకు రెండే రోజులు ఉంది. ఈ పరిస్థితుల్లో బాక్సాఫీస్‌లో ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టాలనే రాధేశ్యాముడి కల నెరవేరుతుందో లేదో.. భారీ వసూళ్లతో ముందుకు దూసుకుపోతుందో లేదో చూడాలి.

Updated Date - 2022-03-09T00:23:54+05:30 IST