Chandrababu-Prabhas: ప్రభాస్తో చంద్రబాబు ఏం మాట్లాడారు?
ABN , First Publish Date - 2022-09-12T23:08:22+05:30 IST
తెలుగు సినిమా లెజెండరీ నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) ఆదివారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయ సినీ రంగానికి చెందినవారు కృష్ణంరాజుకి
తెలుగు సినిమా లెజెండరీ నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) ఆదివారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయ సినీ రంగానికి చెందినవారు కృష్ణంరాజుకి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అయితే.. కృష్ణంరాజు పార్థివ దేహంపై పుష్ప గుచ్చాలు ఉంచి, ప్రభాస్(Prabhas)ని పలకరించి వెళ్ళిపోబోతున్న చంద్రబాబు సడెన్గా మళ్ళీ వెనక్కి వెళ్లారు. ప్రభాస్ను వెంటబెట్టుకుని వెళ్లి కృష్ణంరాజు భార్యని కూడా పరామర్శించారు. పరామర్శ అయిన తర్వాత చంద్రబాబు అక్కడే కొంతసేపు కూర్చుని ప్రభాస్తో మాట్లాడారు కూడా. ప్రభాస్ భుజంపై చెయ్యివేసి చంద్రబాబు మాట్లాడుతున్న ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ చంద్రబాబు.. ప్రభాస్తో ఏమి మాట్లాడారు? వెళ్లిపోతూ.. మళ్లీ వెనక్కి వెళ్లిన చంద్రబాబు.. కొంతసేపు అక్కడే ఎందుకు కూర్చున్నారు? అనే అంశాలపై చాలా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కృష్ణంరాజు చనిపోయే ముందు వరకు భారతీయ జనతా పార్టీ(BJP)తో వున్నారు, అందుకే ఆ పార్టీ నాయకులు ఎక్కువమంది వచ్చి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) వాళ్ళు తక్కువమంది వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కూడా బిజెపికి దగ్గరవటంతో, కృష్ణంరాజు కూడా ఆ పార్టీలో ఉండటంతో, ప్రభాస్ - చంద్రబాబుల మధ్య జరిగిన మాటలు ఏమై ఉంటాయా? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఒక విషాదం చోటుచేసుకున్న ఇంట్లో, రాజకీయాలు మాట్లాడకూడదు కదా, కానీ కృష్ణంరాజు రాజకీయ వారసత్వం కూడా కుటుంబంలోని ఎవరైనా పుచ్చుకుంటే బాగుంటుందనే విషయం కూడా ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో చర్చల్లోకి వస్తోంది. రానున్న సంవత్సరంలో ఎలాగూ ఎన్నికలు ఉంటాయి, అప్పుడు ఈ కుటుంబం నుండి ఎవరినైనా నిలబెడితే.. ప్రభాస్ సపోర్ట్ ఆ వ్యక్తికే కాకుండా, పార్టీకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనేలా అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అందుకే బిజెపి నాయకులు నివాళులు ఇవ్వడానికి ఎక్కువమంది వచ్చి ఉంటారనేలా టాక్ నడుస్తుంది.