‘వలిమై’ ఈవెంట్లోనూ ‘భీమ్లా నాయక్’ గురించే..!!
ABN , First Publish Date - 2022-02-23T04:21:22+05:30 IST
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన చిత్రం ‘వలిమై’. ఐవీవై ప్రొడక్షన్స్ ద్వారా వలిమై చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు గోపీచంద్
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన చిత్రం ‘వలిమై’. ఐవీవై ప్రొడక్షన్స్ ద్వారా వలిమై చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు గోపీచంద్ ఇనుమూరి అందిస్తున్నారు. ఫిబ్రవరి 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రంపై హెచ్. వినోద్ పొగడ్తలు కురిపించారు. ‘భీమ్లా నాయక్’ ప్రస్తావన రాగానే ఒక్కసారిగా ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది.
ఈ కార్యక్రమంలో ఐవీవై ప్రొడక్షన్స్ అధినేత గోపీచంద్ ఇనుమూరి మాట్లాడుతూ.. ‘‘అజిత్ సార్ మూవీ అంటేనే సూపర్. ట్రైలర్ చూడగానే బాగా నచ్చేసింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడం చాలా హ్యాపీగా ఉంది. ఫిబ్రవరి 24న సినిమాను విడుదల చేస్తున్నాం. గుజ్ బమ్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమా మెప్పిస్తుంది’’ అని తెలుపగా... హీరోయిన్ హ్యుమా ఖురేషి మాట్లాడుతూ ‘‘అజిత్ గారితో కలిసి పనిచేయడం చాలా గొప్పగా అనిపించింది. ఆయన గొప్ప స్టార్. భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలెట్గా నిలుస్తాయి. ఈ సినిమాను చిత్రీకరించడంలో చాలా కష్ట నష్టాలను ఫేస్ చేశాం. బోనీ కపూర్గారు మాకు సపోర్ట్గా నిలిచారు. కార్తికేయను స్క్రీన్పై చూస్తే భయమేస్తుంది. తను అంత గొప్పగా నటించాడు. సినిమా అందరినీ మెప్పిస్తుంది’’ అన్నారు.
చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ మాట్లాడతూ ‘‘ ‘ఖాకి’ సినిమా చూసినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంత బాగా ఎంజాయ్ చేశారో దాని కంటే బెటర్ ఎక్స్పీరియెన్స్ను ‘వలిమై’ చిత్రం ఇస్తుంది. ఫిబ్రవరి 24న వలిమై వస్తుంది. తర్వాత 25న మరో స్ట్రోమ్ వస్తుంది. ఆ స్ట్రోమ్ కంటే ముందే ఈ సినిమాను చూసేయండి. అన్ని సినిమాలు మంచి విజయం సాధించాలి. కరోనా కష్టాలు అన్ని దాటి బోనీకపూర్గారి సపోర్ట్తో, భారీ బడ్జెట్తో యాక్షన్ సీన్స్ను చిత్రీకరించాం. సినిమాలోని అన్ని ఎలిమెంట్స్ మెప్పిస్తాయి. అందరూ సపోర్ట్ చేసి, ఈ చిత్రాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను’’ అన్నారు.
నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ.. ‘‘నేను బాలీవుడ్ నిర్మాతనే అయినా నా మనసెప్పుడూ దక్షిణాది సినిమాలపైనే ఉంటుంది. బాపుగారు డైరెక్ట్ చేసిన మనవూరి పాండవులు చిత్రాన్ని హిందీలో హమ్ హై పాంచ్ అనే పేరుతో రీమేక్ చేశాను. అలా తెలుగు సినిమాను రీమేక్ చేయడం ద్వారానే నా కెరీర్ను ప్రారంభించాను. బాపుగారు దర్శకుడిగా నాకెన్నో కొత్త విషయాలను నేర్పించారు. కాదల్ కోటై, వాలి సినిమాల నుంచి అజిత్గారితో మంచి అనుబంధం ఉంది. కాదల్ కోటై చిత్రాన్ని హిందీలో నేనే రీమేక్ చేశాను. ఇక అజిత్తో మూడు సినిమాలు చేసే అవకాశం దక్కింది. మూడో సినిమాను కూడా వినోద్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో సినిమాను కూడా చేస్తాం. అజిత్, వినోద్ ఇద్దరూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఫోకస్గా ఉంటారు. వారు ఎంటైర్ టీమ్ను ముందుకు నడిపించారు. అద్భుతమైన జర్నీ. ఈ జర్నీ ఇంకా కొనసాగనుంది. ఇక కార్తికేయ చూడటానికి సింపుల్గా, కూల్గా కనిపిస్తున్నాడు కానీ.. స్క్రీన్పై బబ్బర్ షేర్లా యాక్ట్ చేశాడు. తనను చూస్తే భయపడతాం అలా నటించాడు. ఫిబ్రవరి 24న రిలీజ్ అయ్యే ‘వలిమై’ సినిమా ఆడియెన్స్కి ఓ కొత్త ఎక్స్పీరియెన్స్నిస్తుంది’’ అన్నారు.