సీక్వెల్స్‌ సందడి షురూ!

ABN , First Publish Date - 2022-01-17T22:43:52+05:30 IST

కరోనా మరోసారి విజృంభించడం సంక్రాంతికి విడుదల కావాల్సిన చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. విడుదల ప్రకటించిన చిత్రాలు ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కినవే కావడం, దేశవ్యాప్తంగా విడుదల కావలసిన ముఖ్యమైన ఏరియాల్లో కర్య్ఫూ అమలులో ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపడం కారణంగా ఈ చిత్రాలన్ని వెనకడుగు వేశాయి. అయితే మంచి రోజులు ముందున్నాయి అనే నమ్మకంతో మేకర్స్‌ ఒకడుగు వెనక్కి వేసినా.. పరిస్థితులు చక్కబడ్డాక మంచి సమయం చూసి తమ చిత్రాలు విడుదల చేయవచ్చనే ఆశాభావంతో ఉన్నారు.

సీక్వెల్స్‌ సందడి షురూ!


కరోనా మరోసారి విజృంభించడంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. విడుదల ప్రకటించిన చిత్రాలు ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కినవే కావడం, దేశవ్యాప్తంగా విడుదల కావలసిన ముఖ్యమైన ఏరియాల్లో కర్య్ఫూ అమలులో ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపడం కారణంగా ఈ చిత్రాలన్ని వెనకడుగు వేశాయి. అయితే మంచి రోజులు ముందున్నాయి అనే నమ్మకంతో మేకర్స్‌ ఒకడుగు వెనక్కి వేసినా.. పరిస్థితులు చక్కబడ్డాక మంచి సమయం చూసి తమ చిత్రాలు విడుదల చేయవచ్చనే ఆశాభావంతో ఉన్నారు.

ఇందులో కొన్ని బడా బడ్జెట్‌ చిత్రాలు కాగా, మరికొన్ని గతంలో హిట్టై, వాటికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రాలు. ఈ చిత్రాల విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘భీమ్లానాయక్‌’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు వాయిదా పడడంతో ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్‌గా వచ్చిన ‘బంగార్రాజు’ లైన్లోకి వచ్చి  సంక్రాంతి హిట్‌గా నిలిచింది. దీనితోపాటు ప్రస్తుతం సెట్స్‌ మీదున్న పలు సీక్వెల్‌ చిత్రాలు త్వరలో ప్రేక్షక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాయి. 



థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ‘కార్తికేయ–2’
హ్యాపీడేస్‌ చిత్రం తర్వాత నిఖిల్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘కార్తికేయ’.  మిస్టరీ థ్రిల్లర్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌ సక్సెస్‌ అయింది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘కార్తికేయ2’ రానుంది. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. సమ్మర్‌లో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.




ఢీ2: డబుల్‌ డోస్‌
శ్రీనువైట్ల కామెడీ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్‌గా గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఢీ’ చిత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మంచు విష్ణు కథానాయకుడి నటించిన ఈ చిత్రం ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ చిత్రానికి సీక్వెల్‌ తీసుకొస్తున్నారు శ్రీనువైట్ల. దీనికి ‘ఢీ2’ అనే టైటిల్‌ నిర్ణయించారు. ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడిగా కార్యకలాపాలతో బిజీగా ఉన్న విష్ణు త్వరలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఈ చిత్రం పాత సక్సెస్‌ను పునరావృతం చేస్తుందని శ్రీనువైట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



‘పుష్ప: ది రూల్‌’ కూడా ఈ సంవత్సరమే!
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ డిసెంబర్‌ 17న విడుదలై సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే! ఇప్పుడు రెండో భాగం కూడా సిద్ధమవుతుంది. డిసెంబర్‌లోనే ఈ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తొలి భాగం సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న చిత్ర యూనిట్‌ త్వరలో పార్ట్‌ 2 సెట్స్‌  మీదకెళ్లనుంది.



వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కో–బ్రదర్స్‌గా నటించి నవ్వులు పూయించిన చిత్రం ‘ఎఫ్‌–2’. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకెళ్లింది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘ఎఫ్‌–3’ తెరకెక్కుతోంది.  అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 25న ‘ఎఫ్‌–3’ని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. తమన్నా, మెహరీన్‌ ఇందులో కథానాయికలు.



‘అధీరా’తో పోరాటం...
కన్నడ స్టార్‌ యశ్‌ నటించిన కేజీఎఫ్‌ చిత్రం ఒక ట్రెండ్‌ సెట్‌ చేసింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపింది. దీనికి కొనసాగింపుగా ‘కేజీయఫ్‌2’ కూడా సిద్ధమవుతోంది. అన్ని కలిసొస్తే గత ఏడాదే విడుదల కావలసిన చిత్రమిది. అయితే కరోనా వల్ల లేట్‌ అయింది. అధీరాను ఎదుర్కొని ‘కేజీఎఫ్‌’ను ఎలా దక్కించుకున్నాడనేది ఈ చిత్ర కథాంశం. ఏప్రిల్‌ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.




విశ్వక్‌సేన్‌ నటించగా బాక్సాఫీస్‌ బద్దలుకొట్టిన ‘హిట్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్‌ –2’ రానుంది. అయితే ఈ చిత్రంలో అడివి శేష్‌ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై నాని నిర్మిస్తున్నారు.

అడవి శేష్‌ హీరోగా సూపర్‌ హిట్టైన స్పై థ్రిల్ల్లర్‌ ‘గూఢాచారి’. 2018లో విజయం అందుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా ‘గూఢాచారి 2’ రాబోతోంది. ప్రస్తుతం ‘మేజర్‌’ చిత్రంతో బిజీగా ఉన్న శేష్‌ ‘గూఢచారి2’ను ఈ ఏడాదే విడుదల చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-17T22:43:52+05:30 IST