Varasudu: విజయ్ దళపతి మూవీ షూటింగ్‌కి బ్రేక్.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-22T15:58:27+05:30 IST

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay). కొన్ని నెలల క్రితం వచ్చిన ‘బీస్ట్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన ఈ నటుడు..

Varasudu: విజయ్ దళపతి మూవీ షూటింగ్‌కి బ్రేక్.. కారణం ఏంటంటే..

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay). కొన్ని నెలల క్రితం వచ్చిన ‘బీస్ట్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన ఈ నటుడు.. ప్రస్తుతం ‘వారిసు (వారసుడు)’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే.. ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘దళపతి 66’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే విజయ్ ‘వారసుడు (Varasudu)’ చిత్ర షూటింగ్ ఆగిపోయినట్లు ప్రచారం జరగుతోంది.


నిజానికి ‘వారసుడు’ ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. దర్శకుడు వంశీ పైడిపల్లి అలసట కారణంగా అస్వస్థతకు గురయ్యారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన చాలా రోజులుగా పగలు, రాత్రి విరామం లేకుండా పని చేయడం ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు.. అందుకే ఒక వారం పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అందుకే మరో వారం రోజుల తర్వాత షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే.. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు. ఈ ప్రచారంపై మూవీ టీం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.


అలాగే.. ‘వారసుడు’ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. అయితే.. అదే రోజు ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్ (Adipurush)’ కానుండడం, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య(Waltair Veerayya)’ కూడా విడుదలయ్యే అవకాశం ఉండడం.. తెలుగులో మూవీ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని మూవీ టీం భావిస్తోందని తెలుస్తోంది. అలాగే.. అదే రోజు ధనుష్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్(Captain Miller)’ కూడా విడుదలకి సిద్ధమవుతుండడంతో తమిళనాడులో కూడా కలెక్షన్లపై ఎఫెక్ట్ ఉండే అవకాశం లేకపోలేదు. అందుకే.. ఈ మూవీ విడుదలపై చిత్రబృందం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.


కాగా.. ‘వారసుడు’ మూవీలో పుష్ప స్టార్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రభుదేవా, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే.. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి వంటి వరుస హిట్ల తర్వాత వంశీ పైడిపల్లి చిత్రం కావడంతో ఈ మూవీ అంచనాలు భారీగానే ఉన్నాయి.

Updated Date - 2022-09-22T15:58:27+05:30 IST