Yogi babu: ప్రముఖ కమెడియన్పై నిర్మాతల మండలికి ఫిర్యాదు.. కారణం ఏంటంటే..
ABN , First Publish Date - 2022-12-07T16:11:40+05:30 IST
ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు(Yogi Babu)పై నిర్మాత గిన్నిస్ కుమార్ చలనచిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు..
ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు(Yogi Babu)పై నిర్మాత గిన్నిస్ కుమార్ చలనచిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. రెమ్యూనరేషన్ తీసుకుని, సినిమాలో నటించేందుకు నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రావడం లేదంటూ నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. యోగిబాబు, నితిన్ సత్య కలిసి నటించిన చిత్రం ‘దాదా’ (Dada). గాయత్రి హీరోయిన్. నాజర్, మనోబాల, సింగముత్తు, భువనేశ్వరి తదితరులు ఇతర పాత్రలను పోషించారు. కథ, స్ర్కీన్ప్లే, మాటలు సమకూర్చిన గిన్నిస్ కిషోర్ సొంతంగా నిర్మించడమేకాకుండా దర్శకత్వం కూడా వహించారు.
ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ తాజాగా జరుగగా, ఈ కార్యక్రమానికి యోగిబాబు హాజరుకాలేదు. ఇందులో నిర్మాత మాట్లాడుతూ.. ‘యోగిబాబుకు ఎంతో మేలు చేశాను. ఆ విశ్వాసం కూడా ఆయనలో లేదు. పైగా ‘దాదా’ చిత్రం పంపిణీ హక్కులను కొనుగోలు చేయొద్దంటూ అనేక మందికి ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారు. నా బ్యానరులోనే మరో చిత్రంలో నటిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు. కానీ, ఇప్పుడు నటించేందుకు ముందుకు రావడం లేదు’ అని తెలిపారు. అనంతరం.. తనతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు యోగిబాబు మరో చిత్రంలో నటించకుండా చర్యలు తీసుకోవాలని గిన్నిస్ కుమార్ నిర్మాత మండలికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.