స్వాతిముత్యం అందరికీ నచ్చేస్తాడు

ABN , First Publish Date - 2022-09-27T06:11:57+05:30 IST

బెల్లంకొండ గణేశ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ కథానాయిక....

స్వాతిముత్యం అందరికీ నచ్చేస్తాడు

బెల్లంకొండ గణేశ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ కథానాయిక. లక్ష్మణ్‌ దర్శకుడు. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. అక్టోబరు 5న విడుదల అవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘అక్టోబరు 5న ‘గాడ్‌ ఫాదర్‌’, ‘ది ఘోస్ట్‌’ రిలీజ్‌ అవుతున్నాయి. పెద్ద సినిమాలతో పోటీ అని కాదు. మాకు కావల్సినన్ని థియేటర్లు మాకు ఉన్నాయన్న నమ్మకంతో, పండగ సీజన్‌లో ఓ మంచి కుటుంబ కథా చిత్రం అందివ్వాలన్న ఆలోచనతో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. మార్నింగ్‌ షో ‘గాడ్‌ ఫాదర్‌’, మ్యాట్నీ ‘ది ఘోస్ట్‌’ చూసి.. ఫస్ట్‌ షోకి ‘స్వాతిముత్యం’ చూడొచ్చు. ‘స్వాతిముత్యం’లో ఓ సమస్య గురించి ప్రస్తావించాం. దాని గురించి ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ మాట్లాడలేద’’న్నారు. గణేశ్‌ మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ ఎంత సరదాగా ఉందో.. సినిమా అంతకంటే ఎక్కువ సరదాగా ఉంటుంది. మనింట్లోనో, మన పక్కింట్లోనో జరిగే కథలా అనిపిస్తుంది. నిర్మాత నాగ వంశీ ఈ కథని బలంగా నమ్మారు. అందుకే ఇంత బాగా వచ్చింద’’న్నారు. ‘‘దర్శకుడికి ఇది తొలి సినిమా. అయినా చాలా చక్కగా తీశారు. ప్రతిభావంతులకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఇంత మంచి అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని వర్ష బొల్లమ్మ చెప్పారు. ‘‘స్వాతిముత్యం అంటే హీరో ఒక్కడే కాదు. ఈ సినిమాలోని ప్రతీ పాత్రలోనూ ఓ అమాయకత్వం ఉంటుంది. అందుకే ఈ పేరు పెట్టాం. మా స్వాతిముత్యం అందరికీ నచ్చేస్తాడ’’న్నారు దర్శకుడు. 


Updated Date - 2022-09-27T06:11:57+05:30 IST