NBK: బాలకృష్ణ సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు!

ABN , First Publish Date - 2022-08-29T23:12:48+05:30 IST

నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన హీరోగా నటించిన వందవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు పన్ను రాయితీ తీసుకొని టికెట్‌ రేటు తగ్గించలేదని సినీ వినియోగదారుల సంఘం పిటీషన్‌ దాఖలు చేసింది.

NBK: బాలకృష్ణ సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు!

నందమూరి బాలకృష్ణ (Nandamuri balakrishna)నటించిన సినిమాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన హీరోగా నటించిన వందవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’(Gouthamiputra sathakarni) సినిమాకు పన్ను రాయితీ తీసుకొని టికెట్‌ రేటు తగ్గించలేదని సినీ వినియోగదారుల సంఘం పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ మేరకు హీరో బాలకృష్ణ, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నిర్మాతలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు సహా ప్రతివాదులందరికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. మరో చిత్రం ‘రుద్రమదేవి’(Rudramadevi)కి సంబంధించి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ రెండూ చారిత్రాత్మక చిత్రాలు కావడంతో ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. రాయితీ తీసుకొని టికెట్‌ ధరలు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని, రాయితీ పొందిన డబ్బు తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్ర చూడ్‌ ధర్మాసనం వివరణ ఇవ్వాల్సిందిగా కథానాయకుడు బాలకృష్ణకు, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. 


ఆ సినిమాలో కేవలం నటుడైన బాలకృష్ణకు పన్నురాయితీ, టికెట్ తగ్గింపు వంటి అంశాలతో సంబంధం లేదు. కానీ, పిటీషనర్లు - బాలకృష్ణ పేరును ప్రతివాదుల్లో  ఒకరిగా పేర్కొనడానికి కారణం. ఆయన (అప్పటి) అధికారపార్టీ ఎమ్మెల్యేగా, (అప్పటి) ముఖ్యమంత్రికి స్వయానా బావమరిదిగా- పన్నురాయితీ ప్రకటనని influence చేశారని పిటీషనర్ వాదించడమే. 


బాలకృష్ణ వందవ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించారు. వై రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. 2017 జనవరి 12న ఈ చిత్రం విడుదలైంది. అనుష్క కీలక పాత్ర పోషించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకనిర్మాత. 2015 అక్టోబర్‌ 9న ఈ చిత్రం విడుదలైంది. 





Updated Date - 2022-08-29T23:12:48+05:30 IST