Krishna: కృష్ణంరాజుతో నాకు 50 ఏళ్ల అనుబంధం ఉంది
ABN , First Publish Date - 2022-09-11T17:57:10+05:30 IST
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam raju) ఆకస్మిక మరణం తెలుగు చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురిచేసింది...
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam raju) ఆకస్మిక మరణం తెలుగు చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురిచేసింది. 1966లో ‘చిలక గోరింకా’ చిత్రంతో తెరంగేట్రం చేసిన కృష్ణంరాజు 56 ఏళ్ల కెరీర్లో 180కి పైగా మూవీస్లో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయన మరణం విషయం తెలిసిన పలువురు టాలీవుడ్ ప్రముఖలంతా తమ సంతాపాన్ని తెలియజేశారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణకి, రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదటి నుంచి మంచి స్నేహం ఉంది. ఈ ఇద్దరూ స్టార్స్ కలిసి దాదాపు ఒకేసారి నట జీవితాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా.. చాలా సినిమాల్లో కలిసి నటించారు. దీంతో కృష్ణంరాజు మరణ విషయం తెలిసిన కృష్ణ (Krishna) ఓ వీడియో ద్వారా ఆయనకి సంతాపం తెలియజేశారు.
‘ఈ రోజు కృష్ణంరాజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. 50 సంవత్సరాల స్నేహం మాది. మొదట ‘తేనె మనసులు’ సినిమా ఆడిషన్స్కి అతను కూడా వచ్చాడు. అప్పుడే మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. నేను ఆ సినిమాతో వెండితెరకి పరిచయం కాగా.. కృష్ణంరాజేమో ‘చిలక గొరింక’ చిత్రంలో ఇంట్రడ్యూస్ అయ్యాడు. అనంతరం నా సినిమా ‘నేనంటే నేను’ అనే మూవీలో కృష్ణంరాజు విలన్గా నటించాడు. ఆ తర్వాత విలన్గా, సెకండ్ హీరోగా నాతో చాలా సినిమాలు చేశాడు. అతను హీరోగా సక్సెస్ అయ్యాక కూడా ‘ఇంద్రభవనం’, ‘యుద్ధం’, ‘అడవి సింహాలు’ వంటి మేమిద్దరం కలిసి నటించాం. అతను ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లడం బాధగా ఉంది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని చెప్పుకొచ్చారు. అలాగే.. సుమన్, విజయనిర్మల నరేశ్, ఆర్పీ పట్నాయక్, వి.వి.వినాయక్, కోన వెంకట్, భాను చందర్ కూడా వీడియో ద్వారా ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేశారు.