V Vijayendra Prasad: ‘ఆనంద్ మఠ్’ స్ఫూర్తిగా సినిమా.. దర్శకత్వం వహించనున్న యస్యస్.రాజమౌళి శిష్యుడు..
ABN , First Publish Date - 2022-08-17T21:59:21+05:30 IST
‘బజరంగీ భాయిజాన్’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలకు కథా రచయితగా పనిచేసిన వ్యక్తి వి. విజయేంద్ర ప్రసాద్ (V Vijayendra Prasad). ‘ఆర్ఆరఆర్’ సంచలన విజయంతో ప్రపంచం దృష్టిని
‘బజరంగీ భాయిజాన్’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలకు కథా రచయితగా పనిచేసిన వ్యక్తి వి. విజయేంద్ర ప్రసాద్ (V Vijayendra Prasad). ‘ఆర్ఆరఆర్’ సంచలన విజయంతో ప్రపంచం దృష్టిని మొత్తం తన వైపునకు తిప్పుకున్నారు. తాజాగా ఓ భారీ బడ్జెట్ సినిమా ‘1770’ కు స్క్రీన్ప్లేను అందించనున్నారు. బంకిం చంద్ర చటర్జీ రాసిన ‘ఆనంద్ మఠ్’ (Anandamath) నవలను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యస్యస్.రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు (Ashwin Gangaraju) దర్శకత్వం వహించనున్నారు. అశ్విన్ గతంలో రాజమౌళి దగ్గర ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలకు అసిస్టెంట్గా పనిచేశారు.
‘1770’ పాన్ ఇండియాగా తెరకెక్కనుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో రూపొందనుంది. శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, బి. కృష్ణ కుమార్, సూరజ్ శర్మ తదితరులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికీ టైటిల్ రోల్ కోసం ఎవరిని ఎంపిక చేయలేదని చిత్ర బృందం ప్రకటించింది. దసరా నాటికి లీడ్ పాత్రను ఎంపిక చేస్తామని తెలిపింది. సాంకేతిక నిపుణులను కూడా దీపావళి నాటికీ ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. హాలీవుడ్కు చెందిన అనేక మంది కూడా ఈ చిత్రాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) కూడా ‘ఆర్ఆర్ఆర్’ ను ప్రశంసించారు. భారత్ ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్కు పంపిస్తే టాప్ ఫైవ్లో నామినేషన్ సాధించే అవకాశం 99శాతం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.