‘శ్యామ్ సింగరాయ్’: ఇదే నా చివరి పాట అవుతుందేమో అని ‘సిరివెన్నెల’ అన్నారు

ABN , First Publish Date - 2021-12-05T03:18:00+05:30 IST

నవంబర్ 3న సిరివెన్నెలగారు కాల్ చేశారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో పాటను పూర్తి చేయలేకపోతున్నాను అని అన్నారు. ఎలాగైనా సరే పాటను పూర్తి చేయండని మేం ఎంతో రిక్వెస్ట్ చేశాం. ఆ తెల్లారే ఆయన ఫోన్ చేసి మమ్మల్ని నిద్రలేపారు. ఆ రోజు దీపావళి. పల్లవి చెబుతాను

‘శ్యామ్ సింగరాయ్’: ఇదే నా చివరి పాట అవుతుందేమో అని ‘సిరివెన్నెల’ అన్నారు

న్యాచులర్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది సినిమాపై భారీగా అంచనాలను పెంచుతూ వస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ రాబోతోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 7న సిరివెన్నెల రాసిన పాటను విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా చిత్రయూనిట్ ప్రకటించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట కావడంతో ఈ పాట ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ పాటకు ఎంత ప్రాముఖ్యత ఉందో నాని, రాహుల్ సంకృత్యాన్ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.


ఈ వీడియో రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. ‘‘నవంబర్ 3న సిరివెన్నెలగారు కాల్ చేశారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో పాటను పూర్తి చేయలేకపోతున్నాను అని అన్నారు. ఎలాగైనా సరే పాటను పూర్తి చేయండని మేం ఎంతో రిక్వెస్ట్ చేశాం. ఆ తెల్లారే ఆయన ఫోన్ చేసి మమ్మల్ని నిద్రలేపారు. ఆ రోజు దీపావళి. పల్లవి చెబుతాను రాసుకోండి అని అన్నారు. మహాభారతం బుక్‌పైన ఆరులైన్లు రాశాను.. అందులోని ఓ లైన్‌లో సిరివెన్నెల అని ఉంది. ఆయన నవ్వుతూ ఇదే నా చివరి పాట అవుతుందేమోనని అన్నారు. విధి అంటే ఇదేనేమో. ఆయన అంత్యక్రియలు జరిగిన రోజే ఆ పాటను రికార్డ్ చేశాం. ఈ పాటతో మరోసారి సిరివెన్నెలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం వచ్చినందుకు సీతారామశాస్త్రిగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.. ’’ అని అన్నారు.


నాని మాట్లాడుతూ.. ‘‘సిరివెన్నెల అనే పాట ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే లెజెండ్ సిరివెన్నెల రాసిన చివరి పాట అది. ఆయన మరోపాటను కూడా రాశారు. దాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తాం. శ్యామ్ సింగ రాయ్ సినిమాను సిరివెన్నెల గారికి అంకితం ఇస్తున్నాం. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం..’’ అని అన్నారు.


‘సిరివెన్నెల’ పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సాంగ్ ప్రోమోను విడుదల చేస్తున్నాం. పూర్తి పాట కావాలంటే మరో మూడు రోజులు ఎదురుచూడాల్సిందే అని నిర్మాత అన్నారు. కాగా, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించగా.. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్  సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.



Updated Date - 2021-12-05T03:18:00+05:30 IST