మళ్లీ ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సినిమాను చేస్తానో.. లేదో!: నిర్మాత

ABN , First Publish Date - 2021-12-11T22:56:56+05:30 IST

శ్యామ్ సింగ రాయ్ ఒక అద్భుతమైన ప్రేమ కథ. సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. డిసెంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. ఈ చిత్ర మేకింగ్ విషయంలో ఏనాడూ ఒత్తిడికి గురి కాలేదు. దానికి కారణం హీరో నాని. ఆయన ఈ కథను నమ్మాడు. ఇండస్ట్రీలో..

మళ్లీ ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సినిమాను చేస్తానో.. లేదో!: నిర్మాత

న్యాచులర్ స్టార్ నాని హీరోగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ బోయనపల్లి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘శ్యామ్ సింగ రాయ్ ఒక అద్భుతమైన ప్రేమ కథ. సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. డిసెంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. ఈ చిత్ర మేకింగ్ విషయంలో ఏనాడూ ఒత్తిడికి గురి కాలేదు. దానికి కారణం హీరో నాని. ఆయన ఈ కథను నమ్మాడు. ఇండస్ట్రీలో 12 ఏళ్లుగా ఉన్నాను. ఏడాది క్రితం నిర్మాతగా మారాను. ఓ మూడేళ్ల నుంచి నాని గారితో సినిమా చేయాలని ఎదురుచూస్తూ వచ్చాను. అలా నాకు ఓ స్పెషల్ మూవీ ఆయనతో చేసే అవకాశం వచ్చింది. మళ్లీ ఇలాంటి సినిమాను చేస్తానో లేదో కూడా తెలీదు.


ఈ సినిమాకి ముందు నేను వేరే సినిమా చేయాల్సింది. కానీ నానిగారే నన్ను ఈ సినిమా చేయమన్నారు. మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం. గొప్ప సినిమా చేయాలని అందరూ అనుకుంటారు. నానికి జర్సీ ఎలాగో నాకు శ్యామ్ సింగరాయ్ అలాంటి చిత్రం. నాని గారితో సినిమా చేస్తే ఒత్తిడి అనేది ఉండదు. కృష్ణార్జున యుద్దం సినిమాలో నేను భాగస్వామిని. చేస్తే ఇలాంటి హీరోతో సినిమా చేయాలని అనుకున్నాను. మొదటగా నిర్మాత అవ్వాలనే ఆలోచన లేదు. కానీ కృష్ణార్జున యుద్దం చేసే సమయంలో సొంత ప్రొడక్షన్ పెట్టాలని అనుకున్నాను. అది కూడా నాని గారి సినిమాతోనే ప్రారంభించాలని రెండున్నరేళ్లుగా ఎదురుచూశాను. నేను ఈ కథ మొత్తం వినలేదు. నాని గారు విన్నారు. ఓకే చెప్పారు. మంచి సినిమా తీయాలనే కోరిక నిర్మాతలందరికీ ఉంటుంది. నేను నానిగారితో మంచి సినిమా తీయాలని అనుకున్నాను. ఈ సినిమా నేను తీసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. రేపు సినిమా విడుదలైతే అందరూ బాగుందని అంటారు. నిహారిక బ్యానర్ అంటే శ్యామ్ సింగ రాయ్ అని అంటారు. నానిగారి మీదున్న నమ్మకంతోనే బడ్జెట్ గురించి ఆలోచించలేదు. ఆయన కథను నమ్మారు. ఆయన్ను నేను నమ్మాను. నానిగారు డైరెక్టర్‌ను నమ్మారు.


కరోనా వల్ల కాస్త బడ్జెట్ పెరిగింది. ఆ విషయం మాకు ముందే తెలుసు. కొన్ని సెట్స్ దెబ్బతిన్నాయి. అందుకే బడ్జెట్ పెరిగింది. థియేటర్స్ కౌంట్ తెలీదు కానీ మాకు కావాల్సినన్నీ థియేటర్లు ఇచ్చారు. దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇది యూనివర్సల్ మూవీ. తెలుగు వాళ్లకే నచ్చే సినిమా ఏమీ కాదు. బెంగాలీలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లేదు. దక్షిణాది భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నాం. ఇది హిందీలో రీమేక్ అవుతుందని నమ్మకం ఉంది. అందుకే హిందీలో విడుదల చేయడం లేదు. ఈ కథకు అందరూ కనెక్ట్ అవుతారు. సినిమా చూస్తే కచ్చితంగా 1970 కలకత్తాకు వెళ్తాం. అక్కడి కల్చర్ తెలుస్తుంది. మనం కచ్చితంగా 70వ దశకంలోకి వెళ్లినట్టు ఫీలవుతాం. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తాం. కలకత్తా బ్యాక్ డ్రాప్‌ను చూపించేందుకు భారీ సెట్స్ వేశాం. అంతేకాకుండా కలకత్తాకు 400 కి.మీ దూరంలో ఉన్న ఊర్లో షూట్ చేశాం.


నా దృష్టిలో నిర్మాతకు హీరో, దర్శకులంటే ప్రేమ ఉండాలి. వారిపై నమ్మకం ఉండాలి. అలాంటప్పుడే మంచి సినిమా వస్తుందని నేను నమ్ముతాను. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మేకింగ్ థియేటర్‌లో ప్రేక్షకులను తప్పకుండా థ్రిల్ చేస్తుంది. విడుదల తర్వాత చాలా రోజులు ఈ సినిమా గురించే అంతా మాట్లాడుకుంటారు..’’ అని తెలిపారు.

Updated Date - 2021-12-11T22:56:56+05:30 IST