తమ్ముడి పాత్రకి అన్న డబ్బింగ్.. మనసుకి కష్టంగా ఉందంటూ..
ABN , First Publish Date - 2022-01-29T19:55:13+05:30 IST
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ గతేడాది అక్టోబర్లో గుండెపోటు మరణించిన విషయం తెలిసిందే.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ గతేడాది అక్టోబర్లో గుండెపోటు మరణించిన విషయం తెలిసిందే. ఆయన హఠాన్మరణం ఎంతోమంది సన్నిహితులు, అభిమానులని షాక్కి గురి చేసింది. గణతంత్ర దినోత్సవం జనవరి 26న సందర్భంగా ఆయన చివరి చిత్రం ‘జేమ్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
అయితే ‘జేమ్స్’లో పాత్రకి పూర్తిగా డబ్బింగ్ చెప్పకముందే పునీత్ కన్నుముశారు. దీంతో ఆయన వాయిస్కి సరిపోయే గొంతు కోసం ఎంతో వెతికిన మూవీ టీం.. చివరికి ఈ పవర్ స్టార్ అన్నయ్య శివ రాజ్ కుమార్ అయితే కరెక్టు అని ఫిక్స్ అయ్యారు.
దీంతో ‘జేమ్స్’ చిత్రంలోని కొన్ని సీన్లకి శివ రాజ్కుమార్ డబ్బింగ్ చెప్పారు. దీని గురించి ఈ నటుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నించాను. కానీ ఆ సమయంలో పునీత్ అలా చూడటం మనసుకి ఎంతో కష్టంగా అనిపించింది. అతనికి డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. అది ఎలా ఉంటుందో, జనాలు ఆదరిస్తారో లేదో చూడాలి’ అంటూ ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు.
ఈ ‘జేమ్స్’ సినిమాలో పునీత్ అన్నయ్యలు శివ రాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ముగ్గురు అన్నదమ్ములను కలిపి ఒకేసారి వెండితెర మీద చూసేందుకు వారి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే పునీత్ భార్య అశ్విని పునీత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చేతన్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా, పునీత్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 17న ఈ చిత్రాన్ని థియేటర్స్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.