ఆ సినిమా చూసి నా భార్య నాతో ఉండలేనని చెప్పింది: Shahid Kapoor
ABN , First Publish Date - 2022-04-06T16:45:45+05:30 IST
బాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో షాహిద్ కపూర్ ఒకరు. ఈ యువ నటుడు మొదటి సినిమా నుంచే..
బాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో షాహిద్ కపూర్ ఒకరు. ఈ యువ నటుడు మొదటి సినిమా నుంచే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’. టాలీవుడ్ యువ నటుడు నాని హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘జెర్సీ’కి రీమేక్గా ఇది తెరకెక్కుతోంది. మాతృక డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరే ఈ సినిమాకీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్లో మూవీ టీం బిజీగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో షాహిద్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
షాహిద్ 2016లో అభిషేక్ దుబే దర్శకత్వంలో ఉడ్తా పంజాబ్ అనే సినిమాలో నటించాడు. అందులో ఈ యువ నటుడు డ్రగ్స్కి బానిసైన రాక్స్టార్ పాత్రని పోషించాడు. ఆ క్యారెక్టర్కి కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ పాత్రలాగే మీకు నిజ జీవితంలోనూ కోపం ఎక్కువగా ఉంటుందా అని యాంకర్ ప్రశ్నించగా.. షాహిద్ ఓ ఫన్నీ సంఘటన గురించి వివరించాడు.
షాహిద్ మాట్లాడుతూ.. ‘నిజ జీవితంలో నాకైతే అంత కోపం లేదు. అయితే ఉడ్తా పంజాబ్ సినిమా వల్ల ఓ హాస్యాస్పదమైన సంఘటన మాత్రం జరిగింది. ఈ సినిమా విడుదలకి ముందే 2015లో నాకు, మీరాతో వివాహం జరిగింది. దీంతో విడుదలకి ముందే ఉడ్తా పంజాబ్ని చూపించడానికి తనని తీసుకెళ్లాను. మేము ఆ మూవీని ఎడిటింగ్ రూమ్లో చూశాం.
ఆ సినిమా ప్రారంభమైనప్పుడు నేను, తను సోఫాలో పక్కపక్కనే కూర్చున్నాం. ఇంటర్వెల్ సమయంలో తన వైపు చూసేసరికి ఆమె నాకు ఐదు అడుగుల దూరంలో ఉంది. మాకు పెళ్లై సంవత్సరం కూడా కాలేదు. అది కాకుండా పెద్దలు కుదిర్చి పెళ్లి కావడంతో ఒకరి గురించి ఒకరికీ పూర్తిగా తెలియదు. దీంతో తను అంత దూరంలో ఉండడాన్ని చూసి ఏమైంది అని అడిగాను. వెంటనే ఆమె నన్ను నిజ జీవితంలో కూడా నువ్వు ఇలాగే ఉంటావా? అని అడిగింది. అదే నిజమైతే నేను నీతో ఉండలేను. నువ్వు నాకక్కర లేదంది. దాంతో షాక్ అయ్యి.. తేరుకొని నేను అలా ఉండను. అది కేవలం క్యారెక్టర్ మాత్రమే అని తనకి చెప్పాను. అప్పుడు నార్మల్ అయ్యింది’ అంటూ ఆ ఫన్నీ సంఘటన గురించి వివరించాడు.