Mahesh Babu: ఆ ట్రాక్ చూడ్డానికి ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వస్తారు
ABN , First Publish Date - 2022-05-11T00:41:12+05:30 IST
సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). పరశురామ్ (Parasuram) దర్శకత్వంలో
సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). పరశురామ్ (Parasuram) దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), జీఏంబీ ఎంటర్టైన్మెంట్ (GMB Entertainment), 14 రీల్స్ ప్లస్ (14 reels Plus) బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను యమా జోరుగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. మంగళవారం హైదరాబాద్లో మీడియాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ‘సర్కారు వారి పాట’ చిత్ర విశేషాలే కాకుండా.. తన తదుపరి చిత్రాలకి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ..
‘‘సర్కారు వారి పాట పూర్తి కమర్షియల్ సినిమా. ఇందులో సందేశాలేం ఉండవు. సరదాగా చూసి రావచ్చు. ఈ సినిమాపై టీమ్ అంతా పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉంటాయి. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు పరశురామ్దే.
మ్యూజిక్ ప్రమోషన్స్లో భాగంగా విడుదలైన మొదటి పాట కళావతీ.. (Kalavathi) మొదట విన్నప్పుడు నాకు అంతగా ఎక్కలేదు. నాకు ఇలాంటి పాట సూటవుతుందా? అని అనిపించింది. కానీ తమన్ (Thaman) గట్టిగా పట్టుపట్టాడు. తప్పకుండా మీ కెరీర్లో నెంబర్ వన్ సాంగ్ అవుతుంది, అన్ని పెళ్లిళ్లలో ఇదే పాట వినిపిస్తుంది అన్నాడు. తన నమ్మకమే నిజమైంది. ఈ సినిమాలో కీర్తితో (Keerthi Suresh) నా లవ్ ట్రాక్ అదిరిపోతుంది. ఆ ట్రాక్ చూడ్డానికి మళ్లీ మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ‘దూకుడు’ (Dookudu) చిత్రంలో సమంత (Samantha)తో లవ్ ట్రాక్ జనాలు బాగా ఎంజాయ్ చేశారు. ఆ సీన్లు చూడ్డానికి రిపీట్ ఆడియన్స్ వచ్చారు. ఈసారి కూడా అదే జరుగుతుంది.
సముద్రఖని (Samuthirakani)గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నాం. కానీ సముద్రఖనిగారు అయితే బాగుంటారని నేను చెప్పగానే.. పరశురామ్ కూడా ఓకే చేశారు. సినిమా షూటింగ్ అంతా అయిపోయాక.. ‘మీరు ఈ సినిమాలో చాలా కళ్ల జోళ్లు వాడారు కదా. నాకొకటి ఇస్తారా.. కళ్ల జోళ్లు కలెక్ట్ చేయడం నా హాబీ’ అని ఆయన అడిగారు. డబ్బింగ్ అంతా అయిపోయాక సినిమా చూస్తే.. సముద్రఖని గారి కోసం కళ్లజోడేంటి.. కళ్లజోడు షాపే కొని ఇచ్చేయొచ్చు అని అనిపించింది. ఆయన ఈ సినిమాకి ప్లస్.
ఈ సినిమాలో నా పాత్ర ‘పోకిరి’ మీటర్లో వుంటుంది. పోకిరి షేడ్స్ లో వున్న క్యారెక్టర్ మళ్ళీ దొరికింది. పోకిరి చూస్తే థియేటర్లో ఒక మాస్ ఫీలింగ్ వుంటుంది. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ ఈ సినిమాతో కుదిరింది. పరాశురామ్ గారు అద్భుతమైన రచయిత. అంత అద్భుతమైన రచయిత దర్శకుడైతే ఇంకా అద్భుతంగా వుంటుంది కదా! పరశురామ్ గారి ‘గీత గోవిందం’ నాకు చాలా నచ్చింది. పరశురాం సర్కారు వారి పాట కథ చెప్పినపుడు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. మరో ఆలోచన లేకుండా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.
మేజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నాలుగేళ్ళుగా ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పడానికి కారణం ఉంది. మంచి కథలు ఎంపిక చేసుకోవడంతో పాటు అనుభవం పెరగడం కూడా ఒక కారణం. గత నాలుగేళ్ళుగా అద్భుతమైన జర్నీ. సర్కారు వారి పాట కూడా విజయవంతమైన సినిమా అవుతుంది.
సితార(Sitara)తో సాంగ్ ఆలోచన థమన్దే. నమ్రత (Namrata)తో మాట్లాడి ఓకే చేశారు. నాకు తెలిసే లోపు సితార షూట్ కూడా కంప్లీట్ చేసింది. సితార డ్యాన్స్ చూసి చాలా గర్వంగా అనిపించింది. పిల్లలపై ఎలాంటి ఒత్తిడి లేదు. సితార పాప తనకి నచ్చింది చేస్తుంది. గౌతమ్(Gautham)కి చదువుకోవడం ఇష్టం. వాళ్ళ ఇష్టాలని గౌరవిస్తాను. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం మాములు విషయం కాదు. అది నా అదృష్టంగా భావిస్తుంటాను. వారి సపోర్ట్ నాకెప్పుడూ ఉంటుంది. వారి కోసం ఎంత కష్టమైనా వెనుకాడను.
తర్వాత త్రివిక్రమ్ (Trivikram) గారితో సినిమా ఉంటుంది. చాలా కొత్తగా ఉంటుంది. ఆయన నా అభిమాన దర్శకుడు. ఆయన రాసే డైలాగ్స్ పలకడమంటే నాకు ఎంతో ఇష్టం. ఆ సినిమా కోసం వేచి చూస్తున్నాను. తర్వాత రాజమౌళి(Rajamouli)గారితో చేస్తున్నా. ఆయనతో ఒక సినిమా చేస్తే పాతిక సినిమాలు చేసినట్టే. బాలీవుడ్ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. తెలుగు వాళ్లని మెప్పించడానికే చాలా కష్టపడాల్సివస్తోంది. ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నా. అందుకే బాలీవుడ్కి వెళ్లే ఆలోచన చేయలేదు..’’ అని చెప్పుకొచ్చారు.