11.30కి గుడ్ మార్నింగ్ చెప్పిన Amitabh Bachchan.. ముసలోడు అంటూ ట్రోలింగ్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సూపర్ స్టార్
ABN , First Publish Date - 2022-05-16T17:44:26+05:30 IST
బాలీవుడ్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. 80వ పడికి దగ్గరలో ఉన్నప్పటికీ..
బాలీవుడ్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. 80వ పడికి దగ్గరలో ఉన్నప్పటికీ ఎంతో యాక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా ఈ వయస్సులోనూ ఈ స్టార్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ అభిమానులలో వృత్తిగత, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో తాజాగా ఉదయం 11.30 గంటలకి ఫెస్బుక్లో గుడ్ మార్నింగ్ అంటూ అభిమానులను పలకరించారు. దీంతో ఇది ఆ సూపర్ స్టార్ ట్రోలింగ్కి గురయ్యేలా చేసింది. అయితే వాటికి అమితాబ్ అదేస్థాయిలో రిప్లై కూడా ఇచ్చారు.
‘మీరు ఎర్లీ మార్నింగ్ విష్ చేశారని అనుకుంటున్నారా?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘నన్ను అపహాస్యం చేసినందుకు ధన్యవాదాలు. మీకో విషయం చెప్పాలి. నేను గత అర్థరాత్రి మొదలైన షూటింగ్ మార్నింగ్ వరకూ సాగింది. అందుకే నిద్రలేవడం ఆలస్యం అయింది. కాబట్టి లేచిన వెంటనే శుభాకాంక్షలు పంపాను. అది మిమ్మల్ని బాధపెడితే క్షమించండి’ అంటూ రాసుకొచ్చారు. అలాగే మరో నెటిజన్ అయితే.. ‘ఇది మధ్యాహ్నం ముసలోడా’ అంటూ కామెంట్ పెట్టాడు. దానిపై అమితాబ్ స్పందిస్తూ.. ‘మీరు చాలా కాలం బతకాలని ప్రార్థిస్తున్నాను.. అయితే మిమ్మల్ని ఎవరూ ముసలోడు అని పిలిచి అవమానించకూడదని కోరుకుంటున్నా’ అని అదే స్థాయిలో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అలాగే మరికొందరు సైతం అమితాబ్ని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. వాటికి సూపర్ స్టార్ సైతం అదే స్థాయిలో రిప్లై ఇవ్వడం గమనార్హం.