Rakul Preet Singh: సినిమా కోసం విమానం సెట్ వేయలేదు.. అందుకే చాలా కష్టంగా అనిపించింది..
ABN , First Publish Date - 2022-04-20T17:01:18+05:30 IST
‘కెరటం’ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి.. తర్వాత టాప్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా ఎదిగిన నటి రకుల్ ప్రీత్ సింగ్...
‘కెరటం’ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి.. తర్వాత టాప్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా ఎదిగిన నటి రకుల్ ప్రీత్ సింగ్. అనంతరం బాలీవుడ్లోకి అడుగుపెట్టి అక్కడ సైతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ తాజాగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘రన్ వే 34’. ఈ సినిమాలో సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గణ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది.
అమితాబ్, అజయ్తో కలిసి పనిచేయడం గురించి రకుల్ మాట్లాడుతూ.. ‘నాకు వారితో కలిసి పనిచేయడం భయంగా అనిపించలేదు. నిజానికి చాలా ఉత్సాహంగా అనిపించింది. అమితాబ్ సర్ అయితే ఎంతో కూల్గా, ఫ్రీగా మాట్లాడేవారు. అంతేకాకుండా ఆయనతో కలిసి పని చేయడం వల్ల ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను. అజయ్ సర్తో ఇంతకుముందే దే దే ప్యార్ దే సినిమాకి కలిసి వర్క్ చేశాను. మొదటిసారి ఆయన్ని మీట్ అయినప్పుడు చాలా భయపడ్డాను. కానీ.. ఆయన వ్యక్తిగా నాకు ఎంతో చేరువయ్యారు. నిజానికి నేను పుట్టిన ఏడాది తర్వాత ఆయన బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. అంటే నేను ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను అన్నమాట. ఆయన ఎంత స్టార్ అయినప్పటికీ తోటి నటులను ఎంతో గౌరవంగా చూస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది.
‘రన్ వే 34’ చిత్రంలో రకుల్ కెప్టెన్ తాన్యా పాత్రలో నటిస్తోంది. మూవీ షూటింగ్ గురించి ఈ భామ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం సెట్ వేయకుండా నిజమైన కాక్పిట్లో చిత్రీకరించాం. మూవీలో మీరు చూసే ప్యానెల్, బటన్ ప్రతిదీ నిజమైందే. కాబట్టి మేము ఏది చేసినా అది వాస్తవమే. దాని కోసం శిక్షణ కూడా తీసుకున్నాం. అయితే.. అంత చిన్న స్థలంలో షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. కానీ.. షూటింగ్ కోసం ఆ కాక్పిట్లో చాలా చిన్నవైన ఏడు కెమెరాలు పెట్టించారు. అది నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా అజయ్ సర్కి పెద్ద సవాలు. కానీ అది మా పనిని మాత్రం కొంచెం సులువు చేసింది’ అని తెలిపింది.