Bahubali 3: బాహుబలి 2లోనే హింట్ ఇచ్చాడుగా.. చివరిలో ఇది విన్నారా?

ABN , First Publish Date - 2022-10-04T18:43:16+05:30 IST

తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన సినిమా ‘బాహుబలి’. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన ఈ మూవీ టాలీవుడ్ స్టార్‌గా ఉన్న ప్రభాస్‌ని పాన్ ఇండియా స్టార్‌గా చేసింది..

Bahubali 3: బాహుబలి 2లోనే హింట్ ఇచ్చాడుగా.. చివరిలో ఇది విన్నారా?

తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన సినిమా ‘బాహుబలి’. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన ఈ మూవీ టాలీవుడ్ స్టార్‌గా ఉన్న ప్రభాస్‌ని పాన్ ఇండియా స్టార్‌గా చేసింది. అనంతరం వచ్చిన రెండో పార్టు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ తెలుగు సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించగలదని నిరూపించింది. అంతేకాకుండా.. తరువాత వచ్చే సినిమాల రికార్డులను నాన్ బాహుబలి రికార్డులుగా చెప్పుకునేలా చేసింది.


ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై దాదాపు రూ.1800 కోట్ల వరకూ కలెక్షన్లని కొల్లగొట్టింది. దాంతో ఈ మూవీ మూడో భాగంగా ‘బాహుబలి 3’ వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే.. అనంతరం ‘ఆర్ఆర్ఆర్’ తెర మీదకి రావడం సంచలన విజయం అందుకోవడం, వెంటనే మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా అంటూ ప్రచారం జరగడంతో ఆ ప్రచారం కొద్దిగా సద్దుమణిగింది. ఈ తరుణంలోనే అమెరికాలో లాస్ ఎంజిల్స్ మూవీ మారథాన్ ఈవెంట్ జరుగుతోంది. సెప్టెంబర్ 30న ప్రారంభమైన ఈ ఈవెంట్ అక్టోబర్ నెలాకరు వరకూ జరగనుంది. ఈ ఈవెంట్‌లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్, బాహుబలి, ఈగ ప్రదర్శించారు. త్వరలో మరికొన్ని మూవీస్‌ని ప్రదర్శించనున్నారు.


ఈ ఈవెంట్‌లోనే రాజమౌళితో ‘క్యూ అండ్ ఏ’ సెషన్‌ని ఈవెంట్ మేనేజ్‌మేంట్ నిర్వహించింది. అందులో భాగంగా ‘బాహుబలి 3’ తీస్తానని చెప్పినట్లు అనుప్ దాసరి అనే ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆయన చేసిన ట్వీట్‌లో.. ‘మూవీ మారథాన్ తర్వాత ప్రశ్నోత్తరాల సెషన్‌లో రాజమౌళి మాట్లాడారు. ఆయన చేసిన సినిమాల్లో ఒకే ఒక సినిమా క్లైమాక్స్‌లో మాత్రం ఓపెన్ ఎండ్‌గా ఓ సంభాషణని పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అది బాహుబలి 2 ఎండ్ క్రెడిట్స్‌లోనే.. అక్కడ ఒక చిన్న అమ్మాయి వాయిస్ ఓవర్ ఉంది. అది బాహుబలి 3 కోసం సూచన. మీలో ఎంత మంది దానిని గమనించారు? #Bahubali #Bahubali3’ అని రాసుకొచ్చాడు.


ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో ‘నేను చూశాను’ అంటూ కొందరూ.. ‘అవునా ఉందా’ అంటూ మరికొందరూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో బాహుబలి 2 క్లైమాక్స్ తర్వాత పేర్లు పడుతున్నప్పుడు.. ఈ సినిమాలో స్వామిజీ వేషం వేసిన తనికెళ్ల భరణికి, ఓ పాపకి జరిగిన సంభాషణకి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. అందులో.. ‘అంటే తాతా.. మహేంద్ర బాహుబలి కొడుకు రాజయ్యాడా’ అని ఓ పాప అడగుతుంది. దానికి సమాధానం.. ‘ఏమో.. శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేటి ఎరుక’ అని తనికెళ్ల రిప్లై ఇచ్చాడు. అది చూసిన పలువురు అభిమానులు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





Updated Date - 2022-10-04T18:43:16+05:30 IST