తారక్ అమ్మగారిది మా రాష్ట్రమే.. జూనియర్ NTR గురించి Puneeth Rajkumar గతంలో చేసిన వ్యాఖ్యలివి..!
ABN , First Publish Date - 2021-10-30T00:33:36+05:30 IST
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో 46 ఏళ్ల వయసులో మరణించారు. జిమ్లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన అపస్మారక స్థితికి లోనయ్యారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో 46 ఏళ్ల వయసులో మరణించారు. జిమ్లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన అపస్మారక స్థితికి లోనయ్యారు. దగ్గర్లోని ఆసుపత్రికి ఆయనను తరలించగా మెరుగైన చికిత్స కోసం వేరే దగ్గరకి తరలించాలని అక్కడి వైద్యులు చెప్పారు. ఫలితంగా ఆయనను విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడి వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. దీంతో కన్నడ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. తమ హీరో చిన్న వయసులోనే కన్ను మూయడంతో అభిమానుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఈ స్టార్ హీరోకు టాలీవుడ్ ఇండస్ట్రీలోను మంచి సంబంధాలు ఉన్నాయి. పునీత్ రాజ్ కుమార్ మృతి చెందడంతో చిరంజీవి, మంచు లక్ష్మీ ప్రసన్న తదితరులు సోషల్ మీడియాలో తమ స్పందనను తెలుపుతూ నివాళులు అర్పించారు.
జూనియర్ ఎన్టీఆర్కు పునీత్ రాజ్ కుమార్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరిలో ఎవరు ఎక్కడికి వచ్చినా మరొకరిని కలవకుండా వెళ్లరు. చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ గురించి పునీత్ రాజ్ కుమార్ ప్రస్తావించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయనను ఎంతగానో మెచ్చుకున్నారు.‘‘ జూనియర్ ఎన్టీఆర్ నా కుటుంబ సభ్యుడిలాంటివాడు. తారక్ మాతృమూర్తి స్వస్థలం కర్ణాటక. మేం ఎంతో సన్నిహితంగా ఉంటాం. ఇద్దరం ఒకే కథతో సినిమా చేశాం. నేను వీరకన్నడిగలో హీరోగా నటిస్తే.. తను ఆంధ్రావాలాలో హీరోగా నటించాడు. నేను అడిగానని నా కోసం చక్రవ్యూహ సినిమాలో పాట పాడాడు. బెంగళూరు వస్తే నాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు ’’ అని తారక్తో అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో పునీత్ రాజ్ కుమార్ చెప్పుకొచ్చాడు.