Prakash Raj: ‘ఇవి మీ నమ్మకాలను దెబ్బతీయడం లేదా’.. ప్రధానిపై ప్రకాశ్ రాజ్ సెటైర్లు
ABN , First Publish Date - 2022-09-01T19:41:08+05:30 IST
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అన్ని చిత్ర సీమల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు...
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అన్ని చిత్ర సీమల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అయితే.. గత కొంతకాలంగా ఈ నటుడు రాజకీయాల్లో కూడా క్రియాశీలాకంగా ఉంటున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి యాంటీ బీజేపీ, యాంటీ మోదీ ఫిలాసఫీతో ముందుకుసాగుతున్నారు. అందుకే అవసరం వచ్చినప్పుడల్లా బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అది కూడా ‘justasking’ యాష్ ట్యాగ్తో ఆ పోస్టులు పెడుతుంటారు.
కొన్ని రోజుల క్రితం తెలంగాణలో ప్రధాని మోదీ ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఆ సందర్భంలో మోదీని ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేశారు. అందులో.. ‘ప్రియమైన అత్యున్నత నాయకుడా.. హైదరాబాద్కు స్వాగతం.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో.. మీ అత్యున్నత పర్యటన కోసం రోడ్లు వేయడానికి పన్ను చెల్లింపుదారులు కోట్లలో డబ్బు ఖర్చు చేస్తారు.. కానీ ఇక్కడ పౌరుల కోసం రోడ్లు వేస్తారు. రైడ్ని ఆస్వాదించండి. ఇక్కడ చూసి మౌలిక సదుపాయాలను ఎలా అందించాలో తెలుసుకోండి. #justasking’ అని రాసుకొచ్చారు. అప్పట్లో ఆయన చేసిన ఆ ట్వీట్ సోషల్ మీడియా తెగ వైరల్ కూడా అయ్యింది.
ప్రకాశ్ రాజ్ తాజాగా మరోసారి మోదీని ఉద్దేశించి, హిందువాదులను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ప్రకాశ్ రాజ్ తాజాగా చేసిన ట్వీట్లో.. వినాయక చవితి సందర్భంగా ప్రధాని మోదీ రూపంలో ఉన్న విగ్రహాలు, ఆర్ఎస్ఎస్ రూపంలో, పుష్పలోని అల్లు అర్జున్లాగా, కేజీఎఫ్ 2లో యశ్లాగా పలు విగ్రహాలను షేర్ చేశాడు. అలాగే.. వినాయకుడితో మోదీపక్కనే కూర్చున్నట్లు, అలాగే ఇతర సినిమాల్లోని ఫేమస్ పాత్రలో రూపంలో ఉన్న వినాయక విగ్రహాలను కూడా షేర్ చేశాడు. ఆ పోస్టుకి.. ‘ఇవి మీ నమ్మకాలను దెబ్బతీయడం లేదా’ అని సెటైరికల్గా రాసుకొచ్చాడు. ఈ పోస్టు సైతం ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. కొందరూ ప్రకాశ్ రాజ్కి అనుకూలంగా.. మరికొందరూ వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.