ప్రభాస్ అరుదైన ఘనత.. మెటావర్స్లో ‘రాధేశ్యామ్’ ట్రైలర్
ABN , First Publish Date - 2022-03-04T22:46:51+05:30 IST
డార్లింగ్, గ్లోబల్ స్టార్ ప్రభాస్ తన ‘రాధేశ్యామ్’ చిత్రంతో అరుదైన ఘనతను సాధించారు. పాన్ ఇండియా స్థాయిలో మార్చి 11న విడుదల కాబోతోన్న ‘రాధేశ్యామ్’ చిత్ర ట్రైలర్ను మెటావర్స్ వెర్షన్లో ప్రదర్శించారు. ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు
డార్లింగ్, గ్లోబల్ స్టార్ ప్రభాస్ తన ‘రాధేశ్యామ్’ చిత్రంతో అరుదైన ఘనతను సాధించారు. పాన్ ఇండియా స్థాయిలో మార్చి 11న విడుదల కాబోతోన్న ‘రాధేశ్యామ్’ చిత్ర ట్రైలర్ను మెటావర్స్ వెర్షన్లో ప్రదర్శించారు. ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ చిత్రానికి ఈ ఘనత లేదు. మార్క్ జుకర్ బర్గ్ అద్భుత సృష్టిగా చెప్పుకోబడుతున్న మెటావర్స్లో ‘రాధేశ్యామ్’ చిత్ర ట్రైలర్ని విడుదల చేసి.. ఒక్కసారిగా ప్రపంచమంతా ఈ చిత్రం గురించే మాట్లాడుకునేలా చేశారు మేకర్స్. నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీగా చెప్పుకోబడుతున్న మెటావర్స్ని ప్రభాస్ తన చిత్ర ట్రైలర్ కోసమే ఉపయోగించి.. ఇప్పుడు సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. దీంతో రాబోయే పాన్ ఇండియా సినిమాలకు ప్రభాస్ ఈ టెక్నాలజీని పరిచయం చేసినట్లయింది. వాస్తవానికి ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా కాన్సెప్ట్ కూడా ఈ టెక్నాలజీకి చాలా దగ్గరగా ఉంటుందనే విషయం తెలిసిందే.
అసలు మెటావర్స్ అంటే ఏమిటి?
ఫిజికల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీలను కలిపి మెటావర్స్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. అంటే, మనుషులు వర్చువల్ విధానంలో ఒకరినొకరు కలుసుకోవచ్చు.. వారితో కలిసి పనిచేయవచ్చు. మెటావర్స్ అనేది ఓ త్రీడీ వీడియో గేమ్ వంటిది. ఇంకా చెప్పాలంటే.. వర్చువల్ విధానమే కానీ.. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే టెక్నాలజీ ఇది. రానున్న 10, 15 సంవత్సరాలలో వంద కోట్ల మందికి మెటావర్స్ వేదిక అవుతుందని మార్క్ జుకర్ బర్గ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక ‘రాధేశ్యామ్’ చిత్ర విషయానికి వస్తే.. కె కె రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధలు నిర్మించారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు యమా జోరుగా సాగుతున్నాయి.