కథా రచయితగా ‘నంది’ పురస్కారం
ABN , First Publish Date - 2022-08-07T20:30:12+05:30 IST
ఆర్.కె - ఎన్.ఏ.టి. సమర్పించిన ‘తల్లా -పెళ్లామా’ (08-01-1970) చిత్రం పబ్లిసిటీ కోసం తీయించుకున్న స్టిల్ యిది. నటుడుగా, కథకుడుగా, దర్శకుడిగా ఎన్.టి.రామారావు ప్రతిభకు ఇది తార్కాణం. ఈ చిత్రం పేరు చెప్పగానే మన
ఆర్.కె - ఎన్.ఏ.టి. సమర్పించిన ‘తల్లా -పెళ్లామా’ (08-01-1970) చిత్రం పబ్లిసిటీ కోసం తీయించుకున్న స్టిల్ యిది. నటుడుగా, కథకుడుగా, దర్శకుడిగా ఎన్.టి.రామారావు ప్రతిభకు ఇది తార్కాణం. ఈ చిత్రం పేరు చెప్పగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది ‘తెలుగుజాతి మనది’ (సినారె/ఘంటసాల/టి.వి.రాజు) అనే గీతం. ఈ చిత్ర నిర్మాణ సమయానికి ఎన్.టి.రామారావు హైదరాబాద్లో ఎన్.టి.ఆర్. ఎస్టేట్ నిర్మించారు. తమ ఆస్తులను ధ్వంసం చేస్తారని సన్నిహితులు హెచ్చరించినా, ధైర్యంగా పై పాటను సినిమాలో పెట్టారు. ఎన్.టి.ఆర్ తల్లిపై గౌరవం కలవాడుగాను, అహంకారి అయిన భార్యకు బుద్ధిచెప్పి పరివర్తన సాధించిన భర్తగాను లీనమై నటించారు.
ఒక ప్రధాన బాలపాత్రలో తన కుమారుడు హరికృష్ణను నటింపజేశారు. హరికృష్ణ నటించిన సన్నివేశాలు సినిమాకే హైలెట్గా నిలిచాయి. తనకు నాయనమ్మ ఉందని తెలుసుకుని, ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి రోడ్డు మీద బయలుదేరిన సన్నివేశాలు జనాల్ని విపరీతంగా ఆకర్షించాయి. ఈ చిత్రంలో మహమ్మద్ రఫీ పాడిన ఒక పాటను మాత్రం రంగుల్లో తీశారు. మద్యపాన దుర్వ్యసనాన్ని ఖండిస్తూ జాతీయ సమైక్యతను ప్రబోధించిన ఈ చిత్రానికి గాను ఉత్తమ కథకుడుగా ఎన్.టి.ఆర్. నంది అవార్డు అందుకున్నారు. ఒక హీరో కథారచయితగా నంది అందుకున్న తొలి సంఘటన ఇదే! ఇదే చిత్రాన్ని ఎల్.వి.ప్రసాద్ ‘బిదాయి’ పేరుతో హిందీలో తీసి విజయం సాధించారు.