బ్రేకింగ్ న్యూస్: Shahrukh Khan, Ananya Pandey ఇళ్లపై NCB దాడులు.. Aryan Khan డ్రగ్స్ కేసులో..
ABN , First Publish Date - 2021-10-21T18:41:52+05:30 IST
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం మరో ఆసక్తికర మలుపు తిరిగింది.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసులో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ బాద్ షా షారూక్ నివాసంపై కొద్ది సేపటి క్రితం ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. బాంద్రాలో ఉన్న షారూక్ నివాసం మన్నత్కు ఎన్సీబీ అధికారలు వచ్చి గాలింపులు చేపడుతున్నారు. అలాగే బాలీవుడ్ కథానాయిక అనన్యా పాండే ఇంటికి కూడా ఎన్సీబీ టీమ్ చేరుకుంది.
సీనియర్ నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన అనన్య.. ఆర్యన్కు మంచి స్నేహితురాలు. ఆర్యన్ ఫోన్ చాటింగ్లో అనన్య పేరు ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారట. ఈ నేపథ్యంలో ముంబైలోని ఖార్ వెస్ట్లో ఉన్న ఆమె ఇంటిపై కూడా ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యను ఆదేశించారు. ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న కొడుకును షారూక్ కలిసిన కొద్ది గంటలకే ఈ దాడులు జరగడం విశేషం.
కాగా, ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం సినిమా ట్విస్టులను తలపిస్తోంది. మొదట మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవడంతో ముంబైలోని ప్రత్యేక కోర్టులో కొద్ది రోజుల క్రితం బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. బుధవారం ఈ బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్టు ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆర్యన్ ఖాన్ తరపు లాయర్ హైకోర్టు మెట్లెక్కేందు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యాపారులతో ఆర్యన్ ఖాన్కు నేరుగా సంబంధాలు ఉన్నాయనీ, బాలీవుడ్లో కొందరు వ్యక్తులకు, డ్రగ్స్ ముఠాకు ఆర్యన్ ఖాన్ మధ్యవర్తిగా ఉన్నాడనీ, లావాదేవీలు జరిపాడన్నది ఎన్సీబీ వాదన. ఓ వర్థమాన నటితో వాట్సప్ చాటింగ్కు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు ఎన్సీబీ సమర్పించింది.
ఈ కేసులో ఎన్సీబీ బలమైన వాదనలను వినిపించడంతో ఆర్యన్ ఖాన్కు బెయిల్ లభించలేదన్నది నిపుణుల వాదన. గురువారం ఉదయం జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ను 19 రోజుల తర్వాత షారూఖ్ ఖాన్ కలిసేందుకు వచ్చాడు. కుమారుడితో మాట్లాడి తిరిగి వెళ్లిన కాసేపటికే ఎన్సీబీ అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన నివాసంలో దాడులు చేపట్టారు. అదే సమయంలో ఆర్యన్ ఖాన్ సన్నిహితురాలయిన అనన్య పాండే నివాసంలో కూడా దాడులు చేపట్టి.. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు నోటీసులు ఇచ్చారు. దీంతో బాలీవుడ్ వర్గాల్లో ఈ వ్యవహారం కాస్తా హాట్ టాపిక్ గా మారింది.