ఆర్యన్ ఖాన్ కేసులో మరో 90రోజులు కావాలంటున్న ఎన్సీబీ
ABN , First Publish Date - 2022-03-29T01:30:50+05:30 IST
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కొడుకు
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం జైలుకు పంపించారు. కొన్ని రోజులకు ఆర్యన్ బెయిల్కు దరఖాస్తు చేసుకోగా ప్రత్యేక కోర్టు పలుమార్లు తిరస్కరించింది. దీంతో అతడు బాంబే హైకోర్టు మెట్లెక్కి షరతులతో కూడిన బెయిల్ను తెచ్చుకున్నాడు.
డ్రగ్స్ కేసును ఎన్సీబీ సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఛార్జ్షీట్ను దాఖలు చేయడానికి తమకు 90రోజుల అదనపు సమయం కావాలని కోర్టును ఎన్సీబీ కోరింది. ముంబై సెషన్స్ కోర్టు ముందు మార్చి28న పిటిషన్ వేసింది. ఏదైనా కేసులో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు(ఎఫ్ఐఆర్) నమోదు చేసిన 180రోజుల్లోగా ఛార్జ్షీట్ను దాఖలు చేయాలి. ఈ ప్రకారం చూసుకుంటే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఛార్జ్షీట్ను దాఖలు చేయడానికి ఏప్రిల్ 2 చివరి తేది అవుతుంది.
ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్లో గతేడాది అక్టోబర్ 3న రేవ్ పార్టీ జరుగుతుండగా ఆర్యన్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో దాదాపుగా 20మందిని ఎన్సీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 18మంది బెయిల్ మీద బయట ఉన్నారు.