వర్మను వదిలి పెట్టే ప్రసక్తే లేదు: Natti Kumar
ABN , First Publish Date - 2022-05-29T01:28:40+05:30 IST
తన సినిమాలకు డబ్బులు పెట్టుబడిగా పెట్టిన ఫైనాన్సియర్లు, నిర్మాతలను మోసం చేస్తూ.. తిరిగి వారి మీదే కేసులు పెట్టే పరిస్థితికి దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దిగజారడం సిగ్గుచేటని నిర్మాత నట్టి కుమార్
తన సినిమాలకు డబ్బులు పెట్టుబడిగా పెట్టిన ఫైనాన్సియర్లు, నిర్మాతలను మోసం చేస్తూ.. తిరిగి వారి మీదే కేసులు పెట్టే పరిస్థితికి దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దిగజారడం సిగ్గుచేటని నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) విమర్శించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో మరో నిర్మాత శేఖర్ రాజు (Sekhar Raju), అడ్వకేట్ నిఖిల్ (Nikhil)తో కలసి ఆయన మాట్లాడారు. ఆర్జీవీ (RGV) మోసగాడని మొదట తనకు తెలియదని, అందుకే ఆయనతో కలసి కొన్ని సినిమాలు చేశానని అన్నారు. అయితే డబ్బులు ఎగగొట్టడమే పనిగా పెట్టుకున్న వర్మ.. తను మాకు స్వయంగా ఇచ్చిన డాక్యూమెంట్స్, సంతకాలను సైతం ఫోర్జరీ అని ప్రచారం చేస్తూ, తమపైనే అక్రమ కేసులు పెడుతుండటం ఆయన క్రిమినల్ మెంటాలిటీకి నిదర్శనమని నట్టి కుమార్ దుయ్యబట్టారు. ఇందులో భాగంగానే తనను ఎదుర్కొనే ధైర్యం లేక, చిన్న పిల్లలు అయిన తన కుమారుడు, కుమార్తె క్రాంతి, కరుణలపై కేసులు పెట్టడాన్ని బట్టి వర్మ నీచత్వం ఏంటో అర్థమవుతుందని, ఫ్యామిలీ మీద కేసులు పెడితే.. భయపడి వెనక్కి తగ్గుతానని, వర్మ అనుకోవచ్చుకానీ.. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాము ఎంతమాత్రం భయపడమని అన్నారు. దాదాపు 22 డాక్యూమెంట్స్ వర్మ మాకు ఇచ్చారు. అందులో వందల సంతకాలు పెట్టాడు. మేము బ్యాంకు ద్వారా ఇచ్చిన డబ్బులు వంటివన్నీ ఫోర్జరీయే అవుతాయా! వీటన్నింటికీ ఆయన ఏం సమాధానం చెబుతాడని.. నట్టి కుమార్ ప్రశ్నించారు.
తమతో పాటు ఇంకా ఎంతోమందికి వర్మ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళందరిని కూడా ఇలానే మోసం చేస్తూ, బెదిరిస్తున్నాడని నట్టి కుమార్ అన్నారు. వాళ్లంతా తనతో కలసి ఎక్కడ పోరాటం చేస్తారోనన్న ఉద్దేశ్యంతో ఒక పథకం ప్రకారం తన పిల్లలపై కేసులు పెడితే, అందరూ భయపడి వెనక్కి తగ్గుతారన్న ఆలోచనతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పలు రకాల సెక్షన్ల కింద ఫిర్యాదు చేశాడని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాంగోపాల్ వర్మ తమకు ఇవ్వాల్సిన డబ్బులపై కోర్టుకు వెళ్లడం జరిగిందని, ఆ మేరకే వర్మ తీసిన ‘లడకీ’(Ladki) (ఎంటర్ ది గర్ల్ డ్రాగన్), ‘మా ఇష్టం’ (Maa Ishtam) (డేంజరస్) చిత్రాలు విడుదల కాకుండా కోర్టు నిలిపి వేసిందని అన్నారు. అలాగే వర్మ సినిమాలేవీ ఇకపై విడుదల కాకుండా ఇలానే అడ్డుకుంటూనే ఉంటామని అన్నారు. తమ డబ్బులు చెల్లించేంతవరకు వర్మను వదిలి పెట్టే ప్రసక్తే లేదని, ఎలాంటి లీగల్ పోరాటానికైనా తాము సిద్ధమేనని అన్నారు. ఇలాంటి మోసం చేసేవాళ్ల వల్ల సినిమా పరిశ్రమలో ఫైనాన్స్ చేసేందుకు ఫైనాన్సియర్స్ భయపడిపోయి, ఇతర నిర్మాతలకు డబ్బులు ఇచ్చేందుకు వెనక్కి తగ్గుతారు అని అన్నారు. వర్మ సినిమాలు వేటినీ కొనవద్దని, అలాగే ఆయనతో కలసి సినిమాలు తీయవద్దని పరిశ్రమకు చెందినవారికి ముందుగా తెలియజేస్తున్నాను.. ఎందుకంటే అవి విడుదల కాకుండా నిలిచిపోతాయని, తద్వారా వారు నష్టపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు. తమను మోసం చేసినట్లే మిగతా వారిని వర్మ మోసం చేస్తాడని అందరూ గ్రహించాలని అన్నారు.
మరో నిర్మాత శేఖర్ రాజు మాట్లాడుతూ.. ‘‘సినిమా రంగంలోనికి నేను ఫ్యాషన్తో వచ్చాను. ఆయన తీసిన ‘దిశ’ (Disha) సినిమాకు నిర్మాతను నేనేనని నమ్మించి, నా దగ్గర 56 లక్షల రూపాయలు తీసుకున్నారు. తర్వాత ఆ సినిమాకు వేరే నిర్మాతల పేర్లు వేసి.. నన్ను మోసం చేశాడు అని చెప్పారు. ఎన్నోసార్లు ఈ విషయం గురించి ఆయనను కలిసే ప్రయత్నం చేసినా, వృధా ప్రయాసే అయ్యింది. అందుకే ఇక లాభం లేదనుకుని, మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాను. నా రావలసిన డబ్బులపై లీగల్గా పోరాటం చేస్తున్నాను..’’ అని తెలిపారు.