సహస్రాధిక చిత్రాల Ilayaraja కు శతాభిషేకం
ABN , First Publish Date - 2022-06-01T19:08:24+05:30 IST
దక్షిణాది సినీ చిత్ర సీమను తన అద్భుత సంగీతంతో కొన్ని దశాబ్దాలుగా ఉర్రూతలూపుతున్నారు సంగీత జ్ఞాని ఇళయరాజా (Ilayaraja). 1979లో తమిళ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా స్వరంగేట్రం చేసిన ఆయన.. ఇప్పటి వరకూ దాదాపు 1400 చిత్రాలకు పైగానే సంగీతం అందించారు. ఇప్పటికీ పలు చిత్రాలకు బాణీలు కడుతూనే ఉన్నారు. రేపు (జూన్ 2) ఇళయరాజా పుట్టినరోజు.
దక్షిణాది సినీ చిత్ర సీమను తన అద్భుత సంగీతంతో కొన్ని దశాబ్దాలుగా ఉర్రూతలూపుతున్నారు సంగీత జ్ఞాని ఇళయరాజా (Ilayaraja). 1979లో తమిళ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా స్వరంగేట్రం చేసిన ఆయన.. ఇప్పటి వరకూ దాదాపు 1400 చిత్రాలకు పైగానే సంగీతం అందించారు. ఇప్పటికీ పలు చిత్రాలకు బాణీలు కడుతూనే ఉన్నారు. రేపు (జూన్ 2) ఇళయరాజా పుట్టినరోజు. రేపటితో ఆయన ఎనభైవ పడిలోకి అడుగుపెడతారు. ఈ సందర్భంగా.. తమిళనాడులోని మయిలాడుదురై జిల్లాలో తరంగంబాడి తాలూకా తిరుక్కడైయూరులోని అభిరామ సమేత అమృత్ కడేశ్వరాలయంలో ఆయనకి శతాభిషేకం జరిగింది. ధర్మాపురం ఆధీనంకు చెందిన ఈ ఆలయంలో మూలవిరాట్టు కాల సంహారమూర్తిగా భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ ఆలయంలో జరిగిన శతాభిషేకం వేడుకల్లో దర్శకుడు భారతీరాజా (Bharathiraja) తో పాటు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ (Gangai Amaran), ఇళయరాజా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సాధారణంగా 60, 70, 75, 80, 90, 100 యేళ్ళు పూర్తి చేసుకున్న వారు షష్ట్యబ్ధి పూర్తి, భీమారథ శాంతి, విజయరథ శాంతి, శతాభిషేకం, కనకాభిషేకం, పూర్ణాభిషేకం, ఆయుష్ హోమాలు చేయించుకుని దైవ దర్శనం చేసుకుంటారు. ఇపుడు 80వ ఏట అడుగుపెడుతున్న ఇళయరాజా ఇక్కడ శతాభిషేకం చేయించుకున్నారు. ఇందుకోసం సోమవారమే ఆలయానికి చేరుకున్న ఇళయరాజాకు ఆలయ ప్రధానార్చకులు, అధికారులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికి, ఆలయ ప్రధాన శివాచార్యులు ఇళయరాజాను ఆలయంలోనికి తీసుకెళ్ళారు. ఆలయ ప్రాంగణంలో ముందుగా గోపూజ చేసిన అనంతరం వందకాళ్ళ మండపంలో 84 కలశాలు, యాగ గుండాలను నిర్మించి తొలి కాల యాగ పూజ చేశారు. మంగళవారం ఉదయం 6 నుంచి 8 గంటలలోపు రెండో కాల యాగపూజతో పాటు శతాభిషేకాన్ని రామలింగ గురుకల్ నేతృత్వంలో 21 మంది శివాచార్యులు పూర్తి చేశారు.