Kangana Ranaut సెలబ్రిటీనే కావొచ్చు.. కానీ ఈ కేసులో నిందితురాలే: కోర్టు

ABN , First Publish Date - 2022-03-24T17:39:23+05:30 IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ఏ విషయం మీదైన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటుందని అందరికి తెలిసిందే...

Kangana Ranaut సెలబ్రిటీనే కావొచ్చు.. కానీ ఈ కేసులో నిందితురాలే: కోర్టు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ఏ విషయం మీదైన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటుందని అందరికి తెలిసిందే. దీంతో వివాదాల్లో సైతం ఇరుక్కుంటూ ఉంటుంది. గతంలో ఓ సారి ప్రముఖ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ మీద సైతం వివాదాస్పద కామెంట్లు చేసింది. దీంతో ఆయన కంగనపై పరువు నష్టం దావా వేశాడు. ముంబైలోని సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది.




అయితే.. వృత్తిగతంగా దేశంలోని వివిధ ప్రదేశాలకు, విదేశాలకు కూడా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఈ కేసు విచారణలో తాను వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేకుండా శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జూన్ 21న కంగన పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన కోర్టు మార్చి 23న ఆ పిటిషన్‌ని కొట్టివేసింది. కేసు గురించి మేజిస్ట్రేట్ ఆర్‌ఆర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఈ కేసు విచారణ సంబంధించి నిందితురాలు ఇంతవరకు కోర్టుకు హాజరుకాలేదు. నిజనిజాలేంటో తేల్చడానికి ఆమె వ్యక్తిగతంగా కోర్టు రావాల్సిన అవసరం ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆమె తన సొంత రూల్స్‌ని నిర్దేశిస్తోంది. 


అయితే.. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. నిందితురాలికి శాశ్వత మినహాయింపు ఇవ్వడం కుదరదు. ఆమె బెయిల్ బాండ్‌లోని నిబంధనలు, షరతులను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. సెలబ్రిటీ అయినందున నిందితురాలికి వృత్తిగతంగా చాలా పనులు ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ ఆమె ఈ కేసులో నిందితురాలనే విషయం గుర్తుంచుకోవాలి’ అంటూ పేర్కొన్నారు.

Updated Date - 2022-03-24T17:39:23+05:30 IST