MAA Election పై ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-10-10T16:43:30+05:30 IST
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా ఉన్నాయి...
హైదరాబాద్ సిటీ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా ఉన్నాయి. ఇవాళ ఉదయం ఎలాంటి గొడవలు లేకుండానే ప్రారంభమైనప్పటికీ రెండు గంటలకే పెద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. ఓ వైపు రిగ్గింగ్ అనుమానాలు, మరోవైపు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత.. వ్యక్తిగతంగా వార్నింగ్లు ఇచ్చుకునేంత పనైంది. ఈ క్రమంలో ఓటేసేందుకు వచ్చిన టాలీవుడ్ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘మా’ కు తెలుసు..!
‘ మా ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో మాకు తెలుసు. ఎవరు గెలిచినా అందరూ సమానమే. మన గొడవల్లో కార్మికులను ఇబ్బంది పెట్టవద్దు. మా ఎన్నికల్లో ఎప్పుడూ ఇంత ఉత్కంఠ లేదు. ఎవరు గెలిచినా మా అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయాలి. ఎంపీ, ఎమ్మెల్యే ఎలెక్షన్ల మాదిరిగా మా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రకాశ్రాజ్, విష్ణు కౌగిలించుకొని ఒక మంచి వాతావరణాన్ని సృష్టించారు. ఎన్నికల తర్వాత కూడా కలిసికట్టుగానే పనిచేయాలి. రెండు గ్రూపులుగా విభజించి రెచ్చగొట్టడం బాధాకరం’ అని రోజా వ్యాఖ్యానించారు. కాగా ఇవాళ ఉదయం పోలింగ్ కేంద్రం లోపల కలెక్షన్ కింగ్ మోహన్ బాబును అన్నయ్యా.. అంటూ ప్రకాశ్ రాజ్ ఆప్యాయంగా పలకరించి నమస్కారం చేశారు. మోహన్ బాబు-ప్రకాష్ ఇద్దరూ మాట్లాడుకున్నారు. అంతేకాదు.. ఈ క్రమంలో పక్కనే ఉన్న విష్ణును దగ్గరికి పిలిచిన మోహన్ బాబు.. ప్రకాశ్ రాజ్తో కరచాలనం చేయించారు. ఈ సందర్భంపై రోజా పై వ్యాఖ్యలు చేశారు.