నేను సెక్యూరిటీని పెట్టుకోను.. అతడు నా అభిమాని కాదు.. ఎయిర్పోర్ట్లో అసలేం జరిగిందో వెల్లడించిన Vijay Sethupathi..!
ABN , First Publish Date - 2021-11-06T23:28:59+05:30 IST
విభిన్న రకాల పాత్రలు పోషిస్తూ చిత్రసీమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి. ఏ పాత్రను అయినా ఆయన అలవోకగా పోషిస్తాడు.
విభిన్న రకాల పాత్రలు పోషిస్తూ చిత్రసీమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి. ఏ పాత్రను అయినా ఆయన అలవోకగా పోషిస్తాడు. అన్ని సినీ ఇండస్ట్రీల్లోను నటిస్తూ బిజీగా ఉన్నాడు. విక్రమ్ వేద, సూపర్ డీలక్స్, మాస్టర్, 96 వంటి చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. తాజాగా ఉప్పెన సినిమాలో తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఒక గుర్తుతెలియని ఆగంతకుడు వెనక నుంచి వచ్చి ఆయనను ఎగిరి తన్నాడు. నటుడి చుట్టూ భద్రత సిబ్బంది ఉన్నప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. విజయ్ సేతుపతిపై దాడి జరగడంతో ఒక్కసారిగా ఆయన షాక్కు గురయ్యాడు. ఈ ఉదంతంపై తాజాగా ఆయన స్పందించాడు.
ఆ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘‘ ఆ వ్యక్తికి మా వ్యక్తిగత సిబ్బందికి విమానంలో ఒక చిన్న అంశం మీద గొడవ జరిగింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయ్యాక కూడా ఇది కొనసాగింది. ఆ సమయంలో అతడు తాగి ఉన్నాడు. అందువల్ల అతడు మతిస్థిమితం కొల్పోయి ఆ విధంగా ప్రవర్తించాడు. నాకు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవడం ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు కూడా నా బెస్ట్ ఫ్రెండ్తోనే విమానంలోనే ప్రయాణిస్తాను. ఆ స్నేహితుడు నాకు 30ఏళ్లుగా తెలుసు. ఇప్పుడు అతడే నాకు మెనేజర్గా ఉన్నాడు. ప్రజలను కలవడానికి, మాట్లాడటానికి నేను ఇష్టపడతాను. ఇటువంటి ఒక ఘటనతో నేను ఏమీ మారిపోను. సెక్యూరిటీ గార్డులను నియమించుకోకపోతే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. మీరు ఎవరికైనా ప్రేమను పంచితే తిరిగి అదే మనకు వస్తుంది. నా పై దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లాము. ఆ స్టేషన్లోనే సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నాం ’’ అని ఆయన చెప్పాడు.