‘మా’ ప్రమాణ స్వీకారం.. మళ్లీ విమర్శలు!

ABN , First Publish Date - 2021-10-16T22:16:55+05:30 IST

‘మా’ ఎన్నికలు ముగియడంతో వివాదాలు,. విమర్శలు ఓ కొలిక్కి వస్తాయనుకుంటే ఇంకా పెరిగేలా వాతావరణం కనిపిస్తోంది. శనివారం ‘మా’ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణుతోపాటు ఆయన ప్యానల్‌ నుంచి గెలిచిన ఆఫీస్‌ బ్యారర్స్‌, ఈసీ మెంబర్స్‌ అంతా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలిచిన సభ్యులు ఎవరూ ఈ వేదికపై దర్శనమివ్వలేదు.

‘మా’ ప్రమాణ స్వీకారం.. మళ్లీ విమర్శలు!

‘మా’ ఎన్నికలు ముగియడంతో వివాదాలు,. విమర్శలు ఓ కొలిక్కి వస్తాయనుకుంటే ఇంకా పెరిగేలా వాతావరణం కనిపిస్తోంది. శనివారం ‘మా’ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణుతోపాటు ఆయన ప్యానల్‌ నుంచి గెలిచిన ఆఫీస్‌ బ్యారర్స్‌, ఈసీ మెంబర్స్‌ అంతా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలిచిన సభ్యులు ఎవరూ ఈ వేదికపై దర్శనమివ్వలేదు. ఆ ప్యానల్‌ సభ్యులకి విష్ణు సందేశం రూపంలో ఆహ్వానం అందించారని సమాచారం. అయితే... సినీ ప్రముఖులకు మాత్రం కొందరికే ఆహ్వానం అందిందని తెలుస్తోంది. సీనియర్‌ నటులైన కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణలను మంచు విష్ణు స్వయంగా ఆహ్వానించారు. కానీ మెగా కుటుంబానికి ఆహ్వానం లేకపోవడంపై ఇప్పుడు చర్చగా మారింది. 


‘మనమంతా ఒకటే.. ఒకే తల్లి బిడ్డలం’ అంటూనే మెగా ఫ్యామిలీని పిలవకపోవడం సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబ సభ్యులను ఉద్దేశ పూర్వకంగానే ఆహ్వానించలేదని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. ‘మేమంతా ఒకే తల్లి బిడ్డలం’ అంటూనే మంచు ఫ్యామిలీ కుట్రపూరితంగా వ్యవహరించిందని సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. అందర్నీ కలుపుకొంటూ పోవడం అంటే ఇదేనా? అంటూ మెగా ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా ప్రమాణ స్వీకారం అనంతరం... మోహన్‌బాబు కూడా పరోక్షంగా చిరు కుటుంబంపై విమర్శల వర్షం కురిపించారు. తనకు పెద్దలంటే ఎంతో గౌరవ మర్యాదలని, చిరంజీవిని త్వరలో కలుస్తానని ఇటీవల మంచు విష్ణు అన్న మాటల్ని గుర్తు చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు, సత్యనారాయణ, సి.కల్యాణ్‌, చదలవాడ శ్రీనివాసరవు లాంటి వారిని పిలవడానికి ఉన్న తీరిక మెగా హీరోలను పిలవడానికి లేదా? అని ట్రోల్‌ చేస్తున్నారు. ఇదేనా పెద్దల్ని గౌరవించడం అంటూ విమర్శలు వస్తున్నాయి. 


ఎన్నికలకు లేని రూల్స్‌ ఇప్పుడు ఎందుకొచ్చాయి...

ఎన్నికల క్యాంపెయిన్‌ జరిగినన్ని రోజులు, పోలింగ్‌ తేదీన ఏ ప్యానల్‌కు కోవిడ్‌ నిబంధనలు గుర్తు రాలేదు. వందల మందిని హోటల్స్‌లో కూర్చోబెట్టి విందు పార్టీలు ఇచ్చారు. గుంపులు గుంపులుగా కలిసి ప్రచారం చేశారు.  ప్రమాణ స్వీకారం విషయం వచ్చే సరికి విష్ణు అండ్‌ టీమ్‌కు, ఎన్నికల అధికారికి కోవిడ్‌ నిబంధనలు గుర్తొచ్చాయి. లిమిటెడ్‌ మీడియాను, కొద్దిమంది సినీ ప్రముఖులనే ఈ కార్యక్రమానికి పిలిచారు. న్యూస్‌ ఛానళ్లకు అయితే ఎంట్రీ లేదు. ఆన్‌లైన్‌ అవుట్‌ మాత్రం ఏర్పాటు చేశారు. అప్పుడు లేని రూల్‌ ఇప్పుడు ఎందుకనే విమర్శలు మొదలయ్యాయి. 

గెలిచిన ప్యానల్‌ వ్యవహారం చూస్తుంటే మున్ముందు ఇలాంటి కొత్త రూల్స్‌ తెరపైకి వచ్చేలా కనిపిస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గెలిచిన రోజే ‘సభ్యులు ఎవరూ మీడియా ముందుకు వెళ్లకూడదు. అందుకు ప్రెసిడెంట్‌ అనుమతి తప్పనిసరి’ అని మోహన్‌బాబు హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ‘మా’ అసోసియేషన్‌లో ఇలాంటి ఎన్నో మంచి రూల్స్‌ కనిపిస్తాయని తెలుస్తోంది.


Updated Date - 2021-10-16T22:16:55+05:30 IST