నటుడు విజయ్కు స్వల్ప ఊరట
ABN , First Publish Date - 2022-08-17T07:09:31+05:30 IST
తమిళ హీరో విజయ్కు ఆదాయపన్ను శాఖ రూ.1.50 కోట్ల జరిమానా విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది...
రూ.1.50 కోట్ల ఐటీ జరిమానాపై హైకోర్టు స్టే
తమిళ హీరో విజయ్కు ఆదాయపన్ను శాఖ రూ.1.50 కోట్ల జరిమానా విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. నటుడు విజయ్ ‘పులి’ చిత్రం ద్వారా లభించిన రూ.15 కోట్ల పారితోషికాన్ని దాచిపెట్టి 2016-17 సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ దాఖలు చేశారనే ఆరోపణపై ఆ శాఖ జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఐటీ అధికారులు విజయ్ నివాసాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో లభించిన దస్తావేజుల ఆధారంగా ‘పులి’ చిత్రం పారితోషికాన్ని లెక్కల్లో చూపించలేదని తేలడంతో జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో ఐటీ జరిమానా విధించడాన్ని సవాల్ చేస్తూ విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఐటీ అధికారులు తాను ఐటీ రిటర్న్ దాఖలు చేసిన ఆర్థిక సంవత్సరంలోనే జరిమానా విధించి ఉండాలని, ఆలస్యంగా విధించిన ఆ జరిమానా చెల్లుబాటు కాదని హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనితా సుమంత్.. విజయ్కు జరిమానా విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ, తదుపరి విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేశారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)