Krishnamraju: అలా 'తేనెమనసులు' చిత్రం చేజారింది..

ABN , First Publish Date - 2022-09-12T02:07:20+05:30 IST

కృష్ణంరాజు (Krishnam Raju) హీరోగా నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్న రోజులవి. అప్పటికే మంచి రచయిత, ఎడిటర్‌, డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నఆదుర్తి సుబ్బారావు 'కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నాము..

Krishnamraju: అలా 'తేనెమనసులు' చిత్రం చేజారింది..

కృష్ణంరాజు (Krishnam Raju) హీరోగా నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్న రోజులవి. అప్పటికే మంచి రచయిత, ఎడిటర్‌, డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నఆదుర్తి సుబ్బారావు 'కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నాము.. ఆసక్తి ఉన్నవాళ్ళు పొటోలు పంపించండి'.. అని ఓ ప్రకటనను అన్ని పత్రికల్లో ఇచ్చారు. అది చూసి కెమెరామెన్ ఎమ్.కె.రాజు కృష్ణంరాజు ఫొటోలు పంపించారు. అప్పటికే కృష్ణంరాజు.. మొదటి సినిమాను చేస్తే గనక ప్రత్యగాత్మ గారి దర్శకత్వంలోనే చేస్తా.. అని పట్టుదలగా ఉన్నారు. అయితే, ఎమ్.కె. రాజు.. ప్రత్యగాత్మ గారితో మాట్లాడి నచ్చజెప్పించారు. స్వయంగా ఆయనే చెప్పటంతో 'తేనెమనసులు' (Tenemanasulu) మేకప్ టెస్ట్ కోసం వెళ్లారు కృష్ణంరాజు. 


అదేరోజు ఆనతో పాటుగా కృష్ణ, జయలలిత, సంధ్యారాణి, హేమామాలిని కూడా మేకప్ టెస్ట్ కోసం వచ్చారు. ఆదుర్తి సుబ్బారావు వద్ద కో-డైరెక్టర్‌గా ఉన్న కె.విశ్వనాథ్ వీరందరికీ మేకప్ టెస్ట్ చేశారు. కృష్ణంరాజుకి ఓ పెద్ద సెంటిమెంట్ డైలాగ్ ఇచ్చి యాక్ట్ చేసి చూపించమన్నారు. ఆ డైలాగ్ చూసి తెలియకుండానే కళ్లలో నీళ్లు వచ్చాయి. ఎంతో భావోద్వేగంగా డైలాగ్ చెప్పారు కృష్ణంరాజు.  


ఇది విశ్వనాథ్ గారికి బాగా నచ్చింది. అయితే ఇక్కడ తుది నిర్ణయం తీసుకోవలసింది ఆదుర్తి సుబ్బారావు. ఆరోజు బ్లాక్ అండ్ వైట్‌లో మేకప్ టెస్ట్ చేశాక కృష్ణంరాజు, జయలలిత, హేమామాలినిలను వెళ్ళిపొమ్మన్నారు. కృష్ణను, సంధ్యారాణికి కలర్ టెస్ట్ చేసేందుకు ఉండమని చెప్పారు. దాంతో ఆ సినిమాలో అవకాశం కృష్ణకు దక్కిందనే విషయం కృష్ణంరాజుకి అర్థమైంది. అలా 'తేనెమనసులు' మేకప్ టెస్ట్' తర్వాత రిజక్ట్ చేయబడిన చాలామందిలో అగ్ర తారలుగా వెలిగిన కృష్ణంరాజు, జయలలిత, హేమామాలిని ఉన్నారు. 

Updated Date - 2022-09-12T02:07:20+05:30 IST