మరోసారి డైరెక్టర్‌గా మారనున్న ధనుష్..?

ABN , First Publish Date - 2022-03-29T00:36:44+05:30 IST

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలు

మరోసారి డైరెక్టర్‌గా మారనున్న ధనుష్..?

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేసే నటుడు ధనుష్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తున్నాడు. అతడు మరోసారి డైరెక్టర్‌గా మారనున్నట్టు సమాచారం. ఓ ప్రాజెక్టును తెరకెక్కించే ఆలోచనలో ధనుష్ ఉన్నట్టు తెలుస్తోంది.  


ధనుష్ గతంలో ‘పవర్ పాండి’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. రాజ్ కిరణ్, రేవతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. ఈ మూవీ 2017లో విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ‘పవర్ పాండి’కీ అభిమానుల మన్ననలతో పాటు, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ధనుష్ అదే ఉత్సాహంతో డైరెక్టర్‌గా ఓ మల్టీ స్టారర్‌ను పట్టాలెక్కించాడు. నాగార్జున, ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, శరత్ కుమార్, అదితి రావ్ హైదరీ ఈ చిత్రంలో నటించారు. శ్రీ తేనాండ్రల్ స్టూడియోస్ ఈ మూవీకీ నిర్మాతగా వ్యవహరించింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ చిత్రానికి బ్రేక్ పడింది. తాజాగా కోలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ధనుష్ త్వరలోనే ఓ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తమిళ నటుడైన రోబో శంకర్ ఓ షోలో చెప్పాడు. ఈ సినిమాలో ధనుష్ టైటిల్ రోల్‌లో నటించనున్నట్టు తెలిపాడు. తనతో పాటు రామర్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించనున్నారని రోబో శంకర్ స్పష్టం చేశాడు. గతంలో తాను దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ ప్రాజెక్టునే ధనుష్ తిరిగి ప్రారంభించనున్నట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలోనే రామర్, రోబో శంకర్ నటించనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


Updated Date - 2022-03-29T00:36:44+05:30 IST