‘ఎన్టీఆర్-31’ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులకు తెలిపిన ప్రశాంత్ నీల్

ABN , First Publish Date - 2022-04-11T00:57:45+05:30 IST

‘కేజీఎఫ్: చాప్టర్-1’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తాజాగా ‘కేజీఎఫ్-2’ను తెరకెక్కించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది

‘ఎన్టీఆర్-31’ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులకు తెలిపిన ప్రశాంత్ నీల్

‘కేజీఎఫ్: చాప్టర్-1’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తాజాగా ‘కేజీఎఫ్-2’ను తెరకెక్కించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. అందులో భాగంగా ప్రశాంత్ నీల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.


‘ఎన్టీఆర్-31’ వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళుతుందని ప్రశాంత్ నీల్ చెప్పాడు. ‘సలార్’ పూర్తయిన అనంతరం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని తెలిపాడు. ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని వివరించాడు. ‘ఎన్టీఆర్-31’ షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా చాల సమయం ఉంది కాబట్టి ఏ జోనరో ప్రస్తుతం అడగొద్దన్నాడు. తాను గత 15-20 ఏళ్లుగా యంగ్ టైగర్‌కు అభిమానినని పేర్కొన్నాడు. తాను సినిమా చేయబోయే హీరోలతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తుంటానని కూడా ప్రశాంత్ చెప్పాడు. అందుకే స్క్రిఫ్ట్ వర్క్ ప్రారంభించడానికి ముందు దాదాపుగా 10 నుంచి 15సార్లు తారక్‌ను కలిశాడట. ఎన్టీఆర్‌తో ప్రయాణం అద్భుతంగా ఉందని ప్రశాంత్ స్పష్టం చేశాడు. ఈ ప్రయాణంలో తాము సన్నిహిత మిత్రులుగా మారామన్నాడు. తాను చెప్పిన కథకు తారక్ ఫిదా అయ్యాడట. ప్రస్తుతం స్క్రిఫ్ట్ వర్క్ జరుగుతోందన్నాడు. 


ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ తాము ఓ ప్రాజెక్ట్‌కు కలసి పనిచేయబోతున్నామని 2021, మే నెలలోనే ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వీరిద్దరి కాంబినేషన్‌లో చిత్రాన్ని నిర్మించనుంది. ఈ ఏడాది మేలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ప్రశాంత్ నీల్ మరో చిత్రం... ‘సలార్’ షూటింగ్ తిరిగి ప్రారంభంకానుంది. 2023 వేసవి కానుకగా ఈ మూవీ విడుదల అవుతుంది. అనంతరం ‘ఎన్టీఆర్-31’ చిత్రీకరణ ప్రారంభమవుతుంది.



Updated Date - 2022-04-11T00:57:45+05:30 IST