Karan Johar: అదో చెత్త.. బాలీవుడ్ సినిమాల ఫెయిల్యూర్పై స్పందించిన కరణ్ జోహార్
ABN , First Publish Date - 2022-07-31T14:40:07+05:30 IST
గత కొంతకాలంగా బాలీవుడ్ గడ్డుకాలం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితిని బీ టౌన్ ఇంతకుముందెన్నడూ చూడలేదు...
గత కొంతకాలంగా బాలీవుడ్ (Bollywood) గడ్డుకాలం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితిని బీ టౌన్ ఇంతకుముందెన్నడూ చూడలేదు. ప్రకటించినప్పుడే ఎంతో బజ్ క్రియేట్ చేసిన సినిమాలు, స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల సినిమాలు రిలీజ్ తర్వాత భారీ ఫ్లాపులుగా మిగులుతున్నాయి. స్టార్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరైన ఓపెనింగ్ కలెక్షన్లు సాధించడంలోనూ చతికిలాపడుతున్నాయి. అదే సమయంలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పుష్ప వంటి సౌత్ సినిమాలు మాత్రం.. పాన్ ఇండియా (Pan India) స్థాయిలో విడుదలై భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. దీంతో బాలీవుడ్ పనైపోయిందంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సౌత్ వర్సెస్ బాలీవుడ్ (South Vs Bollywood) అనేది హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించి అదంతా ఉత్త మాటలే అని చెప్పుకొచ్చారు. తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సైతం ఈ టాపిక్పై తాజాగా స్పందించాడు.
కరణ్ మాట్లాడుతూ.. ‘‘అదో చెత్త చర్చ. బాలీవుడ్ పనైపోయిందనే మాటలకి అర్థం లేదు. మంచి సినిమాలు ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద రాణిస్తాయి. ఇటీవలే వచ్చిన ‘గంగుభాయి కతియావాడి’, ‘భూల్ భూలయ్యా 2’, అలాగే నేను నిర్మించిన ‘జుగ్ జుగ్ జీయో’ అందుకు ఉదాహరణలు. ఈ సినిమాలు మంచి కలెక్లన్లనే సాధించాయి కదా. స్టోరీ బావుంటే సినిమాని ఆదరించేందుకు ప్రేక్షకులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కథ, కథనం బాగాలేని చిత్రాలు అప్పుడు ఇప్పుడూ మంచి ఫలితాన్ని అందుకోలేవు’’ అని నొక్కి చెప్పాడు.
బాలీవుడ్ భవిష్యత్తు గురించి కరణ్ మాట్లాడుతూ.. ‘‘ ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’, రణ్బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్రం’, రోహిత్ శెట్టి, రణ్వీర్ సింగ్ కాంబో చిత్రం ‘సర్కస్’ వంటి భారీ చిత్రాలు వెండితెరపై ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అనంతరం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సైతం బీ టౌన్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి బాలీవుడ్ భవిష్యత్తుకి ఎలాంటి ఢోకా లేదు. హిందీ పరిశ్రమపై ప్రేమని కురిపించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. అయితే.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మంచి కంటెంట్ని సృష్టించడం అవసరం’ అని తెలిపాడు.
కాగా.. కరణ్ ప్రస్తుతం రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే.. ఆయన నిర్మాతగా వ్యవహరించిన పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబో చిత్రం ‘లైగర్’ త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25న విడుదల కానుంది.