Puneeth Rajkumar మృతి.. విషాదంలో కన్నడ ఇండస్ట్రీ.. తరలివస్తున్న అభిమానులు..

ABN , First Publish Date - 2021-10-29T19:59:47+05:30 IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఐసీయూలో ఉంచి డాక్టర్లు చికిత్స చేశారు.

Puneeth Rajkumar మృతి.. విషాదంలో కన్నడ ఇండస్ట్రీ.. తరలివస్తున్న అభిమానులు..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఐసీయూలో ఉంచి డాక్టర్లు చికిత్స చేశారు. కానీ డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించారు. పునీత్ రాజ్ కుమార్ కు ప్రస్తుతం 46 ఏళ్లు. ఎంతో కెరీర్ ఉండి, ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. పునీత్ రాజ్‌కుమార్‌ మరణవార్త గురించి తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలి వస్తున్నారు.


కర్ణాటక లెజండరీ యాక్టర్, కంఠీరవ రాజ్‌కుమార్‌, పార్వతమ్మ దంపతులకు 1975వ సంవత్సరం మార్చి 17వ తారీఖున జన్మించారు. తండ్రి వారసత్వంగా ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలనటుడిగా పలు సినిమాల్లో నటించాడు. 1985వ సంవత్సరంలో బెట్టాడ హూవు అనే సినిమాలో బాలనటుడిగా మెప్పించినందుకుగానూ జాతీయ ఉత్తమ బాలనటుడు అవార్డుకు ఎంపికయ్యారు. అదే సమయంలో Chalisuva Modagalu, Yeradu Nakshatragalu సినిమాలకు గానూ కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఉత్తమ బాలనటుడిగా ఎంపిక చేసింది. హీరోగానే కాకుండా గాయకుడిగా కూడా మెప్పించారు. 2002వ సంవత్సరంలో అప్పు సినిమాతో హీరోగా పునీత్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతోనే పునీత్‌ను అప్పూ అని ఫ్యాన్స్ పిలిచుకోవడం ప్రారంభించారు. వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, అంజనీపుత్ర వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. హీరోగా ఆయన 29 సినిమాల్లో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఆయన నటించిన యువరత్న సినిమా విడుదలయింది. 


ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. 1999వ సంవత్సరంలో డిసెంబర్ ఒకటో తారీఖున అశ్వనీ రేవంత్ అనే ఆమెను పునీత్ రాజ్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. ఫ్రెండ్స్ ద్వారా పరిచయమయిన ఆమెను ఇష్టపడి పెద్దల అంగీకారంతోనే ఆమెను పెళ్లాడారు. ఆ దంపతులకు ధ్రితి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Updated Date - 2021-10-29T19:59:47+05:30 IST