రియాలిటీ షో హోస్ట్గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ Kangana Ranaut..!
ABN , First Publish Date - 2022-02-02T21:09:20+05:30 IST
వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రియాలిటీ షోను
వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రియాలిటీ షోను హోస్ట్ చేయనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా కంగనా రనౌత్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టింది. అయితే నిమిషాల వ్యవధిలోనే ఆ పోస్ట్ను ఆమె డిలీట్ చేసింది. ఓటీటీ వేదికగా ఏక్తా కపూర్ నిర్మించబోయే రియాలిటీ షోలో కంగనా రనౌత్ హోస్ట్గా వ్యవహరించనున్నారట. డేటింగ్, రొమాన్స్ తదితర అంశాలతో రియాలిటీ షో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా 13 మంది నుంచి 15 మంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొన్నబోతున్నారని సమాచారం.
అమెరికన్ రియాలిటీ షో ‘టెంప్టేషన్ ఐలాండ్’ను ఆధారంగా చేసుకొని.. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా షోలో అనేక మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఏఎల్టీ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ సంయుక్తంగా ఈ షోను నిర్మించబోతున్నాయి. ఈ వారంలోనే ఈ షోకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే కంగన ఈ విషయాన్ని బయటపెట్టేసింది. ‘‘నేను మొదటి సారిగా షోను హోస్ట్ చేయబోతున్నాను. ఈ షోకు లేడీ బాస్ ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తోంది’’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది. కానీ, కొద్ది నిమిషాల అనంతరం కంగన ఆ పోస్ట్ను డిలీట్ చేసింది.