Kangana Ranaut: ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్కు వ్యతిరేకంగా పిటిషన్ వేస్తానంటున్న హీరోయిన్
ABN , First Publish Date - 2022-08-21T23:44:32+05:30 IST
మాటలను తూటల్లా సంధించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). సమకాలీన అంశాలపై కూడా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ
ఎదురుగా ఎంతటివాళ్లైనా నదురుబెదురు ఉండదు కంగనా రనౌత్ (Kangana Ranaut)కి, అడ్డూఆపు ఉండదు ఆమె నోటికి. మాటలను తూటల్లా సంధించే ఈ బాలీవుడ్ నటి సమకాలీన సామాజిక/ రాజకీయ అంశాల మీద తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంటుంది. అయితే, ఆమె తాజాగా పెట్టిన instagram story చూస్తే మాత్రం - ఆమెని తిట్టినా సమస్యే, పొగిడినా తగువేనా అనిపించకమానదు. ఫిల్మ్ఫేర్ మేగజైన్ మీద దావా వేస్తానని ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. ఇంతకీ ఫిల్మ్ఫేర్ పత్రిక వాళ్లు చేసిన అపరాధం ఏమిటి? ఉత్తమనటి అవార్డుకి ఆమెని కూడా నామినేట్ చేయడం. ‘తలైవి’ లో చక్కని నటన కనబరచిన కంగనకి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. సహజంగానే జయలలిత పాత్రలో ఒదిగిపోయిన కంగన – ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ఆమె మాత్రం అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. ‘‘అనైతిక, అవినీతి పద్ధతులను అవలంభించే ఫిల్మ్ఫేర్ లాంటి మ్యాగజైన్స్ను నేను 2014 నుంచే బ్యాన్ చేశాను. అయినప్పటికీ ఈ ఏడాది జరగబోయే అవార్డ్స్ ఫంక్షన్కీ హాజరు కావాలంటూ వారి నుంచి నాకు అనేక ఫోన్కాల్స్ వస్తున్నాయి. ‘తలైవి’ (Thalaivii) లో నా నటనకు వారు పురస్కారం అందజేయాలనుకుంటున్నారు. ఈ అవార్డ్కు నన్ను నామినేట్ చేశారని తెలుసుకుని నేను షాక్కు గురయ్యాను. ఇలాంటి పద్ధతులను ప్రోత్సహిస్తే నా నైతిక విలువలను దిగజార్చుకున్నట్టే. అందువల్ల ఫిల్మ్ఫేర్కు వ్యతిరేకంగా దావా వేయాలని నిర్ణయించుకున్నాను. అందరికీ ధన్యవాదాలు’’ అని కంగన పోస్ట్ పెట్టింది.
ఈ ఏడాది పిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ నటి విభాగంలో కంగనా రనౌత్ నామినేట్ అయింది. ఈ కేటగీరీలోనే కియారా అడ్వాణీ, కృతి సనన్, పరిణీతి చోప్రా, తాప్సీ పన్ను, విద్యా బాలన్ పోటీ పడుతున్నారు. సాధారణంగా కంగనా రనౌత్ అవార్డ్స్ ఫంక్షన్కు హాజరు కాదు. ఈ పురస్కారాలనేవి టీఆర్పీల కోసం చేసే జిమ్మికులని గతంలో పలు ఇంటర్వ్యూల్లో ఆమె వ్యాఖ్యానించింది. తనకు ఆస్కార్ అవార్డ్ వచ్చినా వెళ్లనని చెప్పింది. నేషనల్ అవార్డ్స్ దూర్దర్శన్లో ప్రసారమవుతాయి. హంగు, ఆర్భాటాలు, ప్రచారం లేకుండా జరుగుతాయి కాబట్టే వాటికీ హాజరవుతానని కంగన తెలిపింది.