బాలీవుడ్లో హిట్టైన మొదటి సినిమా ఇదే.. అలియాపై మరోసారి Kangana Ranaut విమర్శలు
ABN , First Publish Date - 2022-03-15T15:17:37+05:30 IST
బాలీవుడ్లోని పాపులర్, స్టార్ హీరోయిన్స్లో కంగనా రనౌత్ ఒకరు. అందులో ఎటువంటి సందేహం లేదు...
బాలీవుడ్లోని పాపులర్, స్టార్ హీరోయిన్స్లో కంగనా రనౌత్ ఒకరు. అందులో ఎటువంటి సందేహం లేదు. సినిమాలతోనే కాకుండా కాంట్రవర్సీలతోనూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవలే అలియా భట్ సినిమా ‘గంగుభాయి కతియావాడి’పై విమర్శలు చేసిన ఈ బ్యూటీ మరోసారి కామెంట్స్ చేసింది.
అనుపమ్ ఖేర్ నటించిన ‘ది కాశ్మీరీ ఫైల్స్’ ఇటీవలే విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ విడుదలైన రోజు రూ.4 కోట్లు కలెక్ట్ చేస్తే.. రెండో రోజు అది రెట్టింపై దాదాపు రూ.10 కోట్లు.. మూడో రోజు దాదాపు రూ.17 కోట్ల కలెక్షన్స్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఈ మూవీపై తాజాగా సోషల్ మీడియాలో నటి కంగనా రనౌత్ కూడా స్పందించింది.
ఇన్స్టాగ్రామ్లో కంగనా పెట్టిన స్టోరీలో.. ‘కరోనా మహమ్మారి తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో నిజంగా విజయవంతమై, లాభాలను గడించిన మొదటి సినిమా ‘ది కాశ్మీరీ ఫైల్స్’. దీని గురించి మూవీ మాఫియాతో కుమ్మకైన చెత్త మీడియా చెప్పదు. అందుకే నేను చెబుతున్నా. చిత్ర పరిశ్రమ నుంచి ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడట్లేదు. నా బాధ్యతగా నేను ఇది చేస్తున్నా’ అని రాసుకొచ్చింది. ఇందులో డైరెక్ట్గా అలియా పేరు పెట్టకపోయిన గత వ్యాఖ్యలను బట్టి కంగనా ఆమెనే అంటుందని అందరికీ అర్థమవుతుంది. అలాగే బాలీవుడ్లో నటీనటులు ఈ మూవీపై స్పందించకపోవడంపై కంగనా గట్టిగానే విమర్శలు చేసింది.