రమ్యకృష్ణతో అనుకున్నా..: ‘జయమ్మ పంచాయితీ’ దర్శకుడు
ABN , First Publish Date - 2022-04-28T00:23:50+05:30 IST
స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రం మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో
స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రం మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకాబోతోంది. ప్రమోషన్ లో భాగంగా బుధవారం చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ..
‘‘మాది శ్రీకాకుళం దగ్గరలోని ఒక గ్రామం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక సినిమాపై ఇంట్రెస్ట్తో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. స్టార్ హీరోలతో పనిచేయాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాను. స్టార్ హీరోతో సినిమా తీయడం అంత ఈజీ కాదనే విషయం అర్థమయ్యేసరికి నాకు చాలా టైమ్ పట్టింది. అప్పుడే 60 నుంచి 70 లక్షల బడ్జెట్తో సినిమా తీయడానికి కొంతమంది మిత్రులతో కలిసి పనిచేశాను. ‘జయమ్మ పంచాయితీ’ ఒక పొటెన్షియల్ స్క్రిప్ట్గా వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. అంతలా టాప్ టీవీ యాంకర్ సుమగారు కూడా అందులో చేరారు. ఎంఎం కీరవాణి లాంటి సంగీత దర్శకుడు స్వరాలు సమకూర్చారు. సినిమాను ఫ్లోర్స్ కి తీసుకెళ్లడానికి ముందు ఒక నెల పాటు నటీనటులతో వర్క్షాప్ చేశాం. అలాగే గత కొన్ని వారాలుగా పవన్ కళ్యాణ్, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి వారు మా సినిమాకు ప్రమోషన్ చేయడం నేను ఊహించలేనిది. ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
కథ ప్రకారం నటీనటుల ఎంపికను కరెక్ట్గా చేయాలి. లేదంటే సినిమా ఎవరికీ తెలియకుండా పోతుంది. జయమ్మ పాత్రలో రమ్యకృష్ణ వంటి నటి అయితే బాగుంటుంది అనుకున్నా. అయితే వారిని ఇప్పటికే భిన్నమైన పాత్రల్లో చూశాం. సుమ పేరు ఎవరో సజెస్ట్ చేయడంతో ఆమె దగ్గరకు వెళ్లాను. కథాంశం ఆమెకు నచ్చింది. ఆమె ఆసక్తి చూపిన తర్వాత కూడా నాకు ఆమె నటనపై సందేహం కలిగింది. అందుకే టెస్ట్ షూట్ చేశాం. అది చాలా నమ్మకం కలిగించింది. సుమ చాలా ప్రతిభావంతురాలు. ఆమె ‘బ్రేకింగ్ బాడ్’ వంటి వెబ్ షోలలో నటుల ప్రదర్శనలలోని చిన్న చిన్న అంశాలను కూడా గమనిస్తుంది. అప్పుడే సుమపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆమె నా షార్ట్ ఫిల్మ్స్ చూసింది. కీరవాణిగారు బాణీలు చేయడంతో నాపై నాకు మరింతగా ఆత్మవిశ్వాసం పెరిగింది.
‘జయమ్మ పంచాయతీ’ కథ నిజమైన వ్యక్తుల నుండి ప్రేరణ పొందింది. నా జీవితంలో నేను కలిసిన వ్యక్తులను.. ఇందులో నాటకీయంగా చూపించాను. ఇది కల్పిత కథ అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు వాస్తవ సంఘటనల నుండే ప్రేరణ పొందా. కథ ఆధారంగానే టైటిల్ పుట్టింది. పూర్తిగా చెప్పాలంటే.. సతీ సావిత్రి, యముడి పురాణం మనందరికీ తెలుసు. జయమ్మ కూడా తన సమస్యలపై పోరాడిన కథ. జయమ్మ ఒకప్పుడు సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. ఆమె గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. ఆమె చేసే పోరాటం పెద్ద వివాదంగా మారుతుంది. జయమ్మ అమాయకురాలు. ఆమె పోరాటంలో బలమైన అంశం ఒకటి దాగివుంది. అది ఏమిటినేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా, ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ వంటి వారితో నాకు స్నేహం ఉంది. అందుకే నాకు సినిమాకు దర్శకత్వం వహించడం కష్టంగా అనిపించలేదు..’’ అని తెలిపారు.