Aishwarya-Dhanush: మళ్లీ కలవాలనుకోవడానికి కారణమిదేనా?
ABN , First Publish Date - 2022-10-08T22:39:57+05:30 IST
కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush), ఆయన సతీమణి ఐశ్వర్య (Aishwarya) విడాకులు తీసుకోవాలనే నిర్ణయంపై వెనక్కితగ్గినట్టు గత రెండు రోజులుగా..
కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush), ఆయన సతీమణి ఐశ్వర్య (Aishwarya) విడాకులు తీసుకోవాలనే నిర్ణయంపై వెనక్కితగ్గినట్టు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దానిని ఇటు ధనుష్ దంపతులుగానీ.. వారి కుటుంబ సభ్యులుగానీ ఖండించలేదు. దీంతో వారిద్దరు విడాకులు తీసుకోవాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గారన్న వార్తలు నిజమేనని కోలీవుడ్ వర్గాల సమాచారం. 2004లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల ఈ పిల్లలు చదివే స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమానికి ధనుష్ భార్యతో కలిసి హాజరయ్యారు. ఆ సంఘటనే ఇద్దరిని ఒక్కటయ్యేందుకు శ్రీకారం చుట్టిందని అనుకుంటున్నారు. పైగా, ఎంతో డబ్బు, పేరు ప్రఖ్యాతలున్నప్పటికీ మనశ్శాంతి లేదంటూ రజనీకాంత్ (Rajinikanth) ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.. విడిపోయిన తన కుమార్తె, అల్లుడిని కలిపేందుకు ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు.
వివాహ బంధంపై తనకున్న నమ్మకాన్ని ధనుష్ దంపతులకు వివరించడమే కాకుండా.. కలిసి జీవించేందుకు ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలన్న షరతు కూడా విధించారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన తండ్రి ఆవేదన, పిల్లల భవిష్యత్, కుటుంబ గౌరవ మర్యాదల దృష్ట్యా వారిద్దరూ కలిసి జీవించాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం తర్వాత విజయదశమి రోజున రెండు కుటుంబాల సభ్యులు రజనీకాంత్ నివాసంలో కలుసుకుని పండుగ జరుపుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో విడాకులు కోరుతూ కోర్టులో వేసిన పిటిషన్ కూడా వెనక్కి తీసుకునే విషయంపై ధనుష్ - ఐశ్వర్య ఇద్దరూ సంయుక్తంగా ఒక ప్రకటన రెండు రోజుల్లో విడుదల చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. కాగా, వీరిద్దరు గత జనవరి 17న విడాకులు తీసుకోనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.