ఈ తరానికి ఇళయరాజా ఒక్కరే!
ABN , First Publish Date - 2022-03-23T00:56:17+05:30 IST
ఈ సృష్టికి సూర్యుడు ఒక్కడే. మరో సూర్యుడు లేడు కదా. అలాగే.. ఇళయరాజా, పి.వాసు, భారతీరాజాలు ఒక్కరుగానే ఉంటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం సంతోషంగా ఉంది. సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని
సృష్టికి సూర్యుడు ఒక్కడేనని అలాగే, ఈ తరానికి భారతీరాజా, పి.వాసు, ఇళయరాజా వంటివారు ఒక్కరే ఉంటారని ఇసైఙ్ఞాని ఇళయరాజా అన్నారు. సుభాష్, నేహాలు జంటగా నటించిన చిత్రం ‘కాదల్ సెయ్’. కె.గణేశన్ దర్శకుడు. కుప్పన్ గణేశన్, ఙ్ఞానవినోదన్, సెల్వకుమరన్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక సోమవారం స్థానిక కోడంబాక్కంలోని ఇళయరాజా స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శక దిగ్గజాలు పి.వాసు, భారతీరాజా, ఇళయరాజాలు పాల్గొన్నారు.
ఇందులో ఇళయరాజా మాట్లాడుతూ.. ‘‘ఈ తరానికి ఇళయరాజా, పి.వాసు, భారతీరాజాలు ఒక్కరే. సినిమా రంగంలోకి ఎంత మంది వచ్చినా ఇళయరాజా, పి.వాసు, భారతీరాజాలు కాలేరు. ఈ సృష్టికి సూర్యుడు ఒక్కడే. మరో సూర్యుడు లేడు కదా. అలాగే.. ఇళయరాజా, పి.వాసు, భారతీరాజాలు ఒక్కరుగానే ఉంటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం సంతోషంగా ఉంది. సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుతున్నాను’’ అని అన్నారు.
దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ.. నా సినీ జీవితమే ప్రేమతో ముడిపడి ఉంది. నేను ప్రేమించనిది ఏదీ లేదు. ఇప్పుడు నా ప్రాణ స్నేహితుడు ‘కాదల్ సెయ్’ చిత్రానికి సంగీతం సమకూర్చడం సంతోషంగా ఉంది. నేటి ట్రెండ్కు అనుగుణంగా సంగీతం సమకూర్చారు.. అని అంటే.. దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ.. ఇళయరాజా లేకుంటే నేను లేను. ‘అమ్మ’ పాటకు స్వరపరిచిన సంగీతంతో నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ పాటను ఓ ఆలయంలో ప్రతి రోజూ ప్లే చేస్తుంటారు. ఇపుడు ఈ చిత్రంలో తండ్రి పాటకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ పాట కూడా మంచి ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు. అలాగే, చిత్ర దర్శకుడు, హీరో హీరోయిన్లు, నిర్మాతలు, నటుడు మాస్టర్ మదన్ కూడా ప్రసంగించారు.