పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రాన్ని విడుదల చేస్తోన్న హీరో శ్రీకాంత్

ABN , First Publish Date - 2022-03-01T00:09:20+05:30 IST

కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ని విజయ్. ఎమ్‌తో కలిసి హీరో శ్రీకాంత్ తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన..

పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రాన్ని విడుదల చేస్తోన్న హీరో శ్రీకాంత్

కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ని విజయ్. ఎమ్‌తో కలిసి హీరో శ్రీకాంత్ తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన పునీత్ రాజ్‌కుమార్‌ని ఇప్పటికీ కన్నడ సినీ పరిశ్రమ మరిచిపోలేకపోతోంది. ఒక్క కన్నడ పరిశ్రమ అనే కాదు.. ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ పునీత్‌ని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారంటే అతిశయోక్తి కానే కాదు. అంత మంచిమనసు ఉన్న మనిషి పునీత్ రాజ‌్‌కుమార్. చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ పవర్ స్టార్‌గా ఎనలేని కీర్తిని ఆయన సంపాదించుకున్నారు. ఆయన మృతి తర్వాత విడుదలకాకుండా ఉండిపోయిన సినిమాలన్నీ ప్రస్తుతం వరుసగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అందులో చివరి చిత్రమైన ‘జేమ్స్’ చిత్రం.. పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1వ తేదీన ‘జేమ్స్’ చిత్రంలోని ‘ట్రేడ్ మార్క్’ వీడియో సాంగ్‌ని ఉదయం 11గంటల 11 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. 


పునీత్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. కాగా, పునీత్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని.. ప్రస్తుతం సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని.. హీరో శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్న విజయ్. ఎమ్ తెలిపారు.


పునీత్ రాజ్‌కుమార్, డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం, స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ అందించారు.

Updated Date - 2022-03-01T00:09:20+05:30 IST