(Producers council)కౌన్సిల్కు ఎలాంటి కట్టుబాట్లు లేవు..
తీర్మానాలు వేరు.. జరుగుతున్నవి వేరు
అందులో ఫిలిం ఛాంబర్ (Film chamber)పాత్ర శూన్యం
– ఘట్టమనేని ఆది శేషగిరిరావు
నిర్మాతల మండలిపై సీనియర్ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు (Ghattamaneni Adi Seshagiri Rao )సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌన్సిల్లో చేస్తున్న తీర్మానాలు వేరని, బయట జరుగుతున్న వాస్తవాలు వేరని ఆయన వ్యాఖ్యానించారు. రెండు రోజులు ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని శాఖల అధ్యక్షులు, కార్యదర్శులు పరిశ్రమ సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం గురువారం ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శేషగిరిరావు మీడియాతో మాట్లాడారు. ‘‘కౌన్సిల్కు ఎలాంటి కట్టుబాట్లు లేకుండా డివైడ్ అయిపోయింది. ఇక్కడ తీర్మానాలు వేరు.. బయట జరుగుతున్నవి వేరు. నిర్మాతల మండలి కొంతమంది చేతుల్లోకి వెళ్లింది. సినిమా టికెట్ ధరలు పెంచడం కరెక్ట్ కాదని నిర్మాత దిల్ రాజు ఎక్కడో చెప్పినట్లు విన్నాను. ఏదైనా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వీకెండ్ బిజినెస్ అని కొత్త ట్రెండ్ మొదలైంది. సినిమా విడుదలయ్యాక మూడు రోజులు వ్యాపారం అంతే. సోమవారం నుంచి బిజినెస్ తగ్గిపోతుంది. రేట్లు పెంచమని ప్రభుత్వాన్ని కోరినప్పుడు ఫ్లెక్సిబుల్ రేట్లు అడిగి పర్మిషన్ తెచ్చుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు’’ అని అన్నారు.
ఓటీటీ (Ott)మాధ్యమం వచ్చాక వంద సమస్యలు మొదలయ్యాయని ఆయన కామెంట్ చేశారు. వాటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయిందనీ, ఓటీటీపై కూడా కేంద్రం సెన్సార్ ఉండాలని ఆది శేషగిరిరావు అన్నారు. ఓటీటీలో సినిమా విడుదలైన సాయంత్రానికే పైరసీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఫిలిం ఛాంబర్, యాంటీ పైరసీ (Anti piracy cell) విభాగం ఇతరుల చేతుల్లో ఉందని.. డబ్బున్న వాళ్లకే యాంటీ పైరసీ సెల్ పనిచేస్తోంది. పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ పాత్ర శూన్యం’’ అని ఆయన విమర్శించారు.