గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు హీరోగా.. రాజమౌళి క్లాప్
ABN , First Publish Date - 2022-03-05T05:25:56+05:30 IST
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన వారాహి చలనచిత్రం బ్యానర్లో భారీ బడ్జెట్తో రూపొందనున్న చిత్రంతో కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయం కాబోతున్నారు. రాధా కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన వారాహి చలనచిత్రం బ్యానర్లో భారీ బడ్జెట్తో రూపొందనున్న చిత్రంతో కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయం కాబోతున్నారు. రాధా కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముహూర్తపు షాట్కు క్లాప్ కొట్టగా, కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర వి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘కిరీటీని పరిచయం చేస్తూ టీజర్ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నాడు. నటుడికి కావాల్సిన నటన, నృత్యం, ఫైట్స్ తను చేయగలడు. వారాహి చలనచిత్రం బేనర్లో ఆయనను చూడటం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ప్రముఖ సాంకేతిక సిబ్బంది అయిన సెంథిల్ కుమార్, రవీందర్, దేవిశ్రీ.. కెమెరా, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ విభాగాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో రవి సర్, జెనీలియా, శ్రీలీల వంటి అద్భుతమైన తారాగణం కూడా ఉంది. రవి సార్ కిరీటికి మంచి గైడెన్స్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” అన్నారు.
జెనీలియా మాట్లాడుతూ.. ‘‘నేను నటనకు దూరమై 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమాతో మళ్లీ ముందుకు వచ్చాను. ఇది చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. తొలిసారిగా నటిస్తున్న కిరీటికి గుడ్లక్. గ్యాప్ తీసుకున్నా ఈ చిత్రంతో యువ టీమ్లో కొత్తగా నేను జాయిన్ అయినట్లుగా ఫీలవుతున్నాను’’ అని తెలపగా.. హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘ చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. మమ్మల్ని ఆశీర్వదించిన రాజమౌళి సార్, రవి సార్కు ధన్యవాదాలు. నేను, కిరీటి నిజానికి కుటుంబ స్నేహితులం. కిరీటిలో కష్టపడేతత్త్వం ఉంది. జెనీలియా మేడమ్తో కలిసి పని చేస్తుండటంతో చాలా హ్యాపీ. 10 ఏళ్లు గడిచినా ఆమె లుక్ అలాగే ఉంది’’ అన్నారు.
హీరో కిరీటి మాట్లాడుతూ.. ‘‘నేను సినిమాల్లోకి రావడానికి అప్పు సర్ స్ఫూర్తి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి కొర్రపాటికి ధన్యవాదాలు. మేము కుటుంబ స్నేహితులం. వారు ఈ ప్రాజెక్ట్ను బాగా చూసుకుంటున్నారు. అప్పు సర్కి దొరికిన వ్యక్తి రాధా కృష్ణ. గొప్ప అరంగేట్రం అప్పు సార్కు ఇచ్చారు. మా సినిమాతో జెనీలియాగారు మళ్లీ వస్తున్నందుకు చాలా ఎగ్జైట్గా, ఎమోషనల్గా ఉంది. రవి సర్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. శ్రీలీల నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను ఆమెతో కలిసి నటించడానికి ఎదురు చూస్తున్నాను. అద్భుతమైన సాంకేతిక నిపుణులతో పని చేయడం నా అదృష్టం. సినిమాలో కిక్కి తగ్గ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. నేను కష్టపడి పని చేస్తానని, నా ఉత్తమమైన పెర్ఫార్మెన్స్ అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.