గతంలో లతా మంగేష్కర్పై విష ప్రయోగం జరిగిందని మీకు తెలుసా..?
ABN , First Publish Date - 2022-02-06T22:05:09+05:30 IST
భారత సంగీత ప్రపంచంలో లెజెండ్గా నిలిచిన లతా మంగేష్కర్ ఇక లేరనే విషయం
భారత సంగీత ప్రపంచంలో లెజెండ్గా నిలిచిన లతా మంగేష్కర్ ఇక లేరనే విషయం యావత్ సంగీత ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రపంచాన్ని భౌతికంగా వీడిపోయినప్పటికీ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో మధుర గీతాలను ప్రజలకు అందించారు. తాజాగా ఆమె గొంతు ఏ పాట పాడనంటూ శాశ్వతంగా మూగబోయింది. ఆదివారం ఉదయం లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె మృతిపై పలువురు సెలెబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో ఆమెపై విషప్రయోగం జరిగిన విషయాన్ని సైతం ప్రస్తావిస్తున్నారు.
లతా మంగేష్కర్పై విషప్రయోగం జరిగిన సంగతిని ఆమెతో సన్నిహితంగా మెలిగే ప్రముఖ రచయిత్రి పద్మా సచ్దేవ్ ఓ పుస్తకంలో వెల్లడించారు. లతాజీపై 1963లో విషప్రయోగం జరిగింది. దీంతో ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. వాంతులు కూడా చేసుకున్నారు. కాళ్లు కూడా కదపలేని స్థితికి చేరుకున్నారు. దాదాపుగా మూడురోజుల పాటు మంచానికే పరిమితమయ్యారు. ఆమెకు డాక్టర్లు అనేక పరీక్షలు చేశారు. చివరకు విష ప్రయోగం జరిగిందని నిర్ధారించారు. ఆమెకు ఎవరో స్లోపాయిజన్ ఇచ్చినట్టు వెల్లడించారు.
అయితే, లతా మంగేష్కర్ మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తర్వాత కోలుకున్నారు. ఆమె మంచంపై ఉన్న సమయంలో గేయ రచయిత సుల్తాన్ పురీ సరదాగా కథలు, కవితలు, జోక్స్ చెప్పేవారట. ఆమె తినబోయే ప్రతి ఆహారాన్ని ముందుగానే ఆయన తిని చెక్ చేసేవారట. ఇలా లతా మంగేష్కర్ కోలుకునేందుకు సుల్తాన్ పురీ ఎంతగానో సాయపడినట్లు తెలుస్తోంది.