‘మౌన వ్రతం’ ఆచరించిన లతా మంగేష్కర్.. కారణం ఏంటంటే..
ABN , First Publish Date - 2022-02-07T00:35:28+05:30 IST
లతా మంగేష్కర్ గొంతెత్తి పాడితే సినీ ప్రియులు పులకరించిపోయారు. ఆమె గాన మాధుర్యానికి పరవశించిపోయారు
లతా మంగేష్కర్ గొంతెత్తి పాడితే సినీ ప్రియులు పులకరించిపోయారు. ఆమె గాన మాధుర్యానికి పరవశించిపోయారు. ఎందుకంటే ఆమె గొంతులో అమృతం ఉంది. ఆ గొంతుకు అన్ని రకాల భావాలను పలికించగల సామర్థ్యం ఉంది. గాన కోకిల స్వరం నుంచి వేలల్లోనే పాటలు జాలువారాయి. అయితే, 1960వ దశకంలో మాత్రం కొన్నినెలల పాటు ఆమె పాటలను ఆలపించలేదు. మౌనవ్రతాన్ని ఆచరించారు. అందుకు గల కారణాన్ని ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఓ సందర్భంలో చెప్పారు.
లతాజీ 1960 నాటికే కొన్ని వందల పాటలను పాడారు. దీంతో ఆమెకు గొంతు సంబంధిత సమస్య తలెత్తింది. కొన్ని పాటలను స్వరం పెంచి పాడాల్సి రావడంతో స్వరపేటికలో సమస్య ఏర్పడింది. ఏ పాట పాడినా అనుకున్న రీతిలో వచ్చేది కాదు. దీంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడేవారట. ఈ విషయాన్ని ప్రముఖ గాయకుడు ఉస్తాద్ ఆమిర్ ఖాన్కు చెబితే సమస్య పరిష్కారమయ్యే వరకూ పాటలు పాడవవద్దని చెప్పారట. అప్పుడు లతాజీ కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉంది. అయినప్పటికీ ఉస్తాద్ సూచన మేరకు ఆమె ‘మౌన వ్రతం’ ఆచరించడం మొదలుపెట్టారట. ఆమె కొన్ని నెలల పాటు ఏ గీతాన్నీ ఆలపించలేదు. ఇండోర్లో 2010లో జరిగిన ‘‘మై ఔర్ దీదీ’’ కార్యక్రమంలో హృదయనాథ్ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.