‘పూలరంగడు (Poola Rangadu), చుట్టాలబ్బాయి (Chuttalabbai)’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు వీరభద్రం చౌదరి (Veerabhadram Chowdary). ఆయన దర్శకత్వంలో ‘సేనాపతి’ (Senapathi) చిత్రంతో ప్రశంసలు అందుకున్న నరేష్ అగస్త్య (Naresh Agastya) హీరోగా.. జయదుర్గాదేవి మల్టీమీడియా అండ్ డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్పై అనిల్ రెడ్డి సమర్పణలో సరికొత్త చిత్రం తెరకెక్కబోతోంది. క్రైమ్ కామెడీ జోనర్లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని నబీషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్నారు. జామి శ్రీనివాసరావు సహా నిర్మాత. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్డేట్ను, సంగీత దర్శకుడి వివరాలను మేకర్స్ ప్రకటించారు. జూలై నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లుగా మేకర్స్ తెలిపారు.
దర్శకుడు వీరభద్రం చౌదరి- అనూప్ రూబెన్స్లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘పూలరంగడు’ చిత్రం మంచి విజయం అందుకోవడంతో పాటు ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్లో రాబోతోన్న ఈ చిత్రం కోసం వండర్ ఫుల్ క్రైమ్ కామెడీ స్క్రిప్ట్ని వీరభద్రం చౌదరి సిద్ధం చేశారట.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్లో దర్శకులు వీరభద్రం చౌదరిగారితో మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. వీరభద్రం చౌదరిగారు ఒక అద్భుతమైన కథ చెప్పారు. కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించాం. కథ చాలా వండర్ ఫుల్గా వచ్చింది. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. అనూప్ రూబెన్స్గారు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు.