విజయోత్సవాలకు హీరో రాకుంటే ఎలా..!?: దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-12-23T03:45:21+05:30 IST
అతని సినీ కెరీర్కు ఈ చిత్రం ఓ టర్నింగ్ పాయింట్. పదేళ్ళ తర్వాత ఆయన ఖాతాలో విజయం వచ్చి చేరింది. అలాంటి చిత్ర థ్యాంక్స్ మీట్కు హీరో రాకపోవడం ఆశ్చర్యం వేసింది. ఎన్ని కార్యక్రమాలు, సినిమా షూటింగులు ఉన్నప్పటికీ..
ఒక హీరోను దశాబ్దకాలం తర్వాత విజయం వరిస్తే ఆ చిత్ర విజయోత్సవ కార్యాక్రమానికి హాజరుకాకపోవడం ఏమాత్రం బాగోలేదని ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ హీరో శింబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వెంకట్ప్రభు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సురేష్ కామాక్షి తన సొంత నిర్మాణ సంస్థ వి హౌస్ ప్రొడక్షన్పై శింబు హీరోగా నటించిన చిత్రం ‘మానాడు’. గత నెలలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం థ్యాంక్స్ మీట్ కార్యక్రమం తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఇందులో చిత్ర బృందంతో పాటు టెక్నీషియన్లు, సీనియర్ నిర్మాత కె. రాజన్, సీనియర్ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇందులో ఎస్.ఏ. చంద్రశేఖర్ (ఎస్ఏసీ) మాట్లాడుతూ.. ‘‘శింబు సినీ కెరీర్కు ఈ చిత్రం ఓ టర్నింగ్ పాయింట్. పదేళ్ళ తర్వాత ఆయన ఖాతాలో విజయం వచ్చి చేరింది. అలాంటి చిత్ర థ్యాంక్స్ మీట్కు శింబు రాకపోవడం ఆశ్చర్యం వేసింది. ఎన్ని కార్యక్రమాలు, సినిమా షూటింగులు ఉన్నప్పటికీ.. కెరీర్కు టర్నింగ్ పాయింట్గా ఉన్న ఈ చిత్రం థ్యాంక్స్ మీట్కు ఆయన రావాల్సి ఉంది’ అని అన్నారు. నిర్మాత సురేష్ కామాక్షి మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ, ఇలాంటి కాన్సెప్టు కథను అంగీకరించి నటించేందుకు ముందుకు వచ్చిన హీరో శింబుకు, ఈ కథను తెరకెక్కించేందుకు సమ్మతించిన నిర్మాత సురేష్ కామాక్షికి ధన్యవాదాలు అని తెలిపారు. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, ఎడిటర్ ప్రవీణ్, నిర్మాత కె.రాజన్, నటుడు ఎస్.జె.సూర్య తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.