రాముని పరాక్రమాన్ని ‘ఆదిపురుష్’ లో చూపిస్తాను: ఓం రౌత్

ABN , First Publish Date - 2022-04-04T00:44:57+05:30 IST

‘బాహుబలి’ సినిమాలో హీరోగా చేసి ఆశేష అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్

రాముని పరాక్రమాన్ని ‘ఆదిపురుష్’ లో చూపిస్తాను: ఓం రౌత్

‘బాహుబలి’ సినిమాతో ఆశేషంగా అభిమానులను సంపాదించుకున్నాడు హీరో ప్రభాస్. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ప్రేక్షకులను అలరించి.. పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియాగా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం అతడి చేతిలో ‘సలార్’, ‘ఆది పురుష్’, ‘ప్రాజెక్ట్-కే’, ‘స్పిరిట్’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఆదిపురుష్’ను రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గతంలోనే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. తాజాగా ఓం రౌత్.. మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సినిమాకు సంబంధించిన ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు.


రామాయణం ప్రభావం తనపై ఎంతగానో ఉందని ఓం రౌత్ చెప్పాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువవుతుందన్నాడు. ఈ చిత్రంలో రాముని వైభవం, శోభ, పరాక్రమాన్ని చూపిస్తానన్నాడు. ప్రభాస్, సైఫ్ అలీఖాన్‌లతో పనిచేయడం అద్భుతంగా ఉందన్నాడు. ‘‘ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. షూటింగ్‌కు ఎప్పుడూ ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకొచ్చి అందరికీ రుచి చూపించేవాడు. రామునిగా కనిపించాలి కాబట్టి శరీరాన్ని ఫిట్‌గా ఉంచమని ప్రభాస్‌కు చెప్పాను. నేను చెప్పిన వెంటనే జిమ్ చేయడం ప్రారంభించాడు’’ అని ఓం రౌత్ స్పష్టం చేశాడు.

Updated Date - 2022-04-04T00:44:57+05:30 IST